సుమారు ఒకటిన్నర నెల రోజుల విరామం తర్వాత ఏపీలో బడిగంట మోగింది. వేసవి సెలవుల సీజన్ పూర్తి కావటంతో విద్యార్థులకు శుక్రవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిన విద్యార్థులు
ఇప్పుడు భారంగా బడి వైపు కదులుతున్నారు. మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి (Acadamic Calender 2026-27) ఏపీ విద్యాశాఖ ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ అకడమిక్ క్యాలెండర్లో ఈ విద్యా సంవత్సరంలో ఎన్నిరోజులు పాఠశాలలు పనిచేస్తాయి.. ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి.. ఏ పండుగకు ఎన్ని రోజులు హాలీడేస్ వస్తాయనే వివరాలను పేర్కొన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సందర్భంగా.. ఈ వివరాలను ఇప్పుడోసారి చర్చించుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. అలాగే 87 రోజులు సెలవులు ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతీ వారంలోనూ 24 నుంచి 30 పీరియడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలవుల సంగతికి వస్తే దసరాకు (విజయదశమి) పది రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించనున్నారు. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ దసరా సెలవులు ఉంటాయి. మైనారిటీ విద్యాసంస్థలకు అక్టోబర్ 15 నుంచి సెలవులు ఇస్తారు. ఇక మైనార్టీ విద్యా సంస్థలకు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకూ క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. సాధారణ స్కూళ్లకు డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ హాలీడే ఉంటుంది. సంక్రాంతి పండుగ సెలవుల విషయానికి వస్తే జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకూ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 13 నుంచి హాలీడేస్ ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్కి సంబంధించి ఆగస్టు నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 3 నుంచి 6 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ -1 , అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ -2 , జనవరి 4 నుంచి 7 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ -3, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 11 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ -4 పరీక్షలు నిర్వహిస్తారు.సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల విషయానికి వస్తే నవంబర్ 9 నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ సమ్మేటివ్ అసెస్మెంట్ -1, ఏప్రిల్ 3 నుంచి 17వ తేదీ వరకూ సమ్మేటివ్ అసెస్మెంట్ -2 పరీక్షలు ఉంటాయి. పది విద్యార్థుల కోసం ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ పదో తరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9వ తేదీ వరకూ పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు.. 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ -2 పరీక్షలు ఉంటాయి. మార్చి 15 నుంచి మార్చి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ఏపీ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకటించింది.