
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Pawan Kalyan Speech At Tirupati: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, గత ఎన్నికల పొత్తులు, కూటమి ఏర్పాటు వెనుక ఉన్న అసలు రహస్యాలు, భవిష్యత్ లక్ష్యాలపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేయడంపై వచ్చిన విమర్శలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. "జనసేన కేవలం 21 సీట్లకే పరిమితమైందంటూ చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆ రోజు మేము సీట్ల కోసం రాజీపడలేదు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి మేము చేసిన రాజకీయ త్యాగమే, ఈ రోజు కూటమి సాధించిన చారిత్రాత్మక విజయానికి బలమైన పునాదిగా మారింది. అధికారాన్ని పంచుకోవడం మా లక్ష్యం కాదు.. బాధ్యతను పంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా అసలు లక్ష్యం" అని పవన్ స్పష్టం చేశారు.
గ్రామ స్థాయిలోనే సమస్యలు తీరాలి! అభివృద్ధి అనేది గ్రామ స్థాయి నుంచే ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గ్రామమే దేశ ప్రగతికి కేంద్ర బిందువు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చే నిర్ణయాలు గ్రామ పంచాయతీ స్థాయిలోనే జరగాలని ఆయన అన్నారు.
"ప్రస్తుతం ప్రతి చిన్న సమస్యకూ ప్రజలు ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను బలహీనపరిచి, మొత్తం వ్యవస్థను ఎమ్మెల్యేల చుట్టూ కేంద్రీకరించడం సరైన పద్ధతి కాదు. ఏ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఆ గ్రామాల్లోనే పరిష్కారమయ్యేలా మార్పు రావాలి" అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ ఉక్కుపై సమిష్టి విజయం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ సమిష్టిగా కృషి చేస్తున్నాయని పవన్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వ సమిష్టి ప్రయత్నాలు ఫలించాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, యువత ఉపాధి, రాష్ట్ర ప్రగతి కోసం అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
2024 ఎన్నికల తీర్పు ఏపీలో ఒక కొత్త తరం భవిష్యత్తుకు నమ్మకాన్ని ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నా.. సరైన సమయంలో తమ ఓటు హక్కుతో చరిత్రను తిరగరాయగలరని గత ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే ఈ కూటమి ప్రభుత్వమని ఆయన అభివర్ణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.