
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్
ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహిచారు. ప్రెస్ మీట్ లో నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సింగీతం సార్ 14 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సింగ్ గీతం’. ఇలాంటి సినిమా ఇప్పటివరకు వరల్డ్ సినిమాలో రాలేదు. గత ఒక ఏడాదిగా నేను, దేవిశ్రీ ప్రసాద్ గారు, మా టీమ్ అందరం ఆయనతో ట్రావెల్ చేసి ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాం. రేపటి నుంచి ఈ సినిమా లైఫ్ ప్రారంభమవుతుంది. ఈ మొత్తం జర్నీలో సింగీతం గారు హైదరాబాద్ రావాలని చాలాసార్లు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఆయన మనందరికీ తన శుభాకాంక్షలు పంపించారు. ఇప్పటికీ ఆయన అదే ఎనర్జీతో ఉన్నారు. సింగీతం గారు 40 ఏళ్ల క్రితం కమల్ హాసన్ గారితో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు అది కుదరలేదు. ఇది సింగీతం గారి 40 ఏళ్ల కల. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది కూడా ఆయన స్టైల్లో చేసిన మరో సరికొత్త ప్రయోగం. ఆయన జీనియస్ ఫిల్మ్మేకర్. నేను 10 ఏళ్ల వయసులో ‘ఆదిత్య 369’ సినిమా చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడమ ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మరో 10 ఏళ్ల కుర్రాడు కూడా ఇన్స్పైర్ కావాలని మా ఆశ. *అనంతరం విలేకరలు అడిగిన ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానాలు ఇచ్చారు. ఈ చిత్రం చివరి నిమిషంలో ఒక్కరోజు వాయిదా పడింది కదా. కారణం ఏమిటి? -ఇది మ్యూజికల్ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్లో మ్యూజిక్ వర్క్ చాలా ఉంటుంది. సాధారణ సినిమాల్లో డబ్బింగ్ తర్వాత ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది. కానీ ఇందులో డబ్బింగ్లో చిన్న మార్పు జరిగినా మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ గారు పని చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలో అన్ని పాత్రలకు వాళ్లే పాటలు పాడారు. ఆ ప్రక్రియ కొంచెం ఎక్కువ సమయం తీసుకుంది. ఈ కథ ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ అవుతుందా? -‘సింగ్ గీతం’ కథ చెప్పినప్పుడు ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదని చెప్పారు. ప్రపంచంలోనే ఎవరూ తీయలేదని అన్నారు. ఈ జర్నీ చేసిన తర్వాత మాకూ అదే అనిపించింది. నిజంగా ఇలాంటి సినిమా ఎక్కడా రాలేదు. -సింగీతం గారి ఆలోచనలు ఎప్పుడూ చాలా కొత్తగా ఉంటాయి. ‘ఆదిత్య 369’ ఇప్పటికీ చాలా అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది. ఆయన అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారు. ఆయన కథలకు ఏజ్ ఉండదు. ఆయన విజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేమంతా కలిసి పని చేశాం. ఈ కథను మీరు ఎప్పుడు విన్నారు? -‘మహానటి’ సినిమా తర్వాత విన్నాను. ఆయన ఎప్పటినుంచో ఈ ప్రాజెక్ట్పై చాలా ప్యాషన్తో ఉన్నారు. కచ్చితంగా ఇలాంటి సినిమా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆయన జీనియస్ దర్శకుడు. ఒక ఐడియాను ఎంత బలంగా నమ్ముతారో ఈ ప్రాజెక్ట్ దానికి ఉదాహరణ. చెన్నై ఈవెంట్లో మీరు చెప్పులు తీసేసి కింద కూర్చున్నారు కదా? ఆ రోజు సింగీతం గారు వీల్చైర్లో స్టేజ్పైకి వెళ్తున్నారు. అక్కడే వున్నా నేను కింద కూర్చున్నప్పుడు చెప్పులు అడ్డంగా ఉన్నాయి. వాటిని పక్కకు జరిపి కూర్చున్నాను. అది ఎవరైనా రికార్డ్ చేస్తున్నారని తెలిస్తే నిజంగా కుర్చీలోనే కూర్చునేవాడిని (నవ్వుతూ). -సింగీతం గారు నాకంటే అడ్వాన్స్డ్గా అనిపిస్తుంటారు. ఆయన జెన్-ఆల్ఫా. ఆయన కాన్సెప్ట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఒక ఊరికి శాపం వచ్చి అందరూ పాటల ద్వారానే మాట్లాడటం అనే ఆలోచన ఎప్పుడు తీసిన కొత్తగానే వుంటుంది. -మాటలే పాటలుగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో పాటలు వస్తున్నాయనే విషయం ప్రేక్షకుడికి తెలియకుండానే కథతో పాటు ప్రయాణిస్తారు. ఇది ఫాంటసీ కామెడీ మ్యూజికల్ ఫిల్మ్. చాలా మంచి ఫన్ ఉంటుంది. కమల్ హాసన్ గారిని కూడా ఇందులో భాగం చేయాలని అనిపించిందా? దేవిశ్రీ ప్రసాద్ గారు, కమల్ హాసన్ గారు కలిసి కూర్చొని కొన్ని ఆలోచనలు చేశాం. ‘మహానటి’, ‘కల్కి’ చిత్రాల్లో సింగీతం గారి కాంట్రిబ్యూషన్ ఏంటి? ‘మహానటి’ సమయంలోనే ఆయనను మొదటిసారి కలిశాను. ఆయనతో ఒక్క మీటింగ్ చాలు జీవితాంతం గుర్తుండిపోవడానికి. సావిత్రి గారిని ప్రత్యక్షంగా కలిసిన వ్యక్తి మనతో సినిమా గురించి గంటసేపు మాట్లాడడం ఎంతో గొప్ప అనుభవం. ఇప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా చేయడం, ఆయన విజన్ను తెరపైకి తీసుకురావడం అనేది నిజంగా అన్బిలీవబుల్గా అనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకు మ్యూజిక్ను ఎలా రూపొందించారు? -దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజికల్ జీనియస్. ఆయనకు తెలుగు భాష బాగా తెలుసు. లిరిక్స్ కూడా రాస్తారు. మాటలను సంగీతంగా మలచగలరు. ఆయన ఈ సినిమాకు ఎలాంటి సంగీతం అందించారో మీరు బిగ్ స్క్రీన్పై చూడాల్సిందే. ఆయన నిద్రపోకుండా చివరి నిమిషం వరకూ ప్రాణం పెట్టి పని చేశాం. ఈ సినిమా కోసం చాలా టైం ఇచ్చారు. రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు ఈ సినిమాపై బైట్స్ ఇచ్చారు కదా? సింగీతం గారి గురించి ఒక వీడియో రిలీజ్ చేశాం. దాన్ని చాలా మంది దర్శకులు చూశారు. ‘మహానటి’కి ఎలా అందరూ ప్రేమతో సపోర్ట్ చేశారో, ‘సింగ్ గీతం’కూ అలాగే సపోర్ట్ చేస్తున్నారు. సింగీతం గారు సంపాదించుకున్న గుడ్విల్ అది. సింగీతం గారు షూటింగ్ సమయంలో సెట్స్కు వచ్చేవారా? అవును. కొన్ని రోజులు సెట్స్కు వచ్చారు. మరికొన్ని రోజులు వర్చువల్గా మానిటర్ చూస్తూ దర్శకత్వం వహించారు. కెమెరామెన్తో మాట్లాడేవారు. మేము ముందుగానే చాలా రిహార్సల్స్ చేశాం. దేవిశ్రీ ప్రసాద్ గారు ముందుగానే మ్యూజిక్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే షూట్ చేశాం. నిర్మాతగా ఇది రిస్కీ ప్రాజెక్ట్ కాదా? -మా గత 15 ఏళ్ల జర్నీ చూస్తే మేము సినిమాల్ని ప్రేమతోనే చేశాం. సింగీతం గారికి కూడా సినిమా అంటే అపారమైన ప్రేమ. మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలని ఉద్దేశంతో దీన్ని చేశాం. ట్రైలర్ రిలీజ్ చేయకపోవడానికి కారణం? -ఇది చాలా కొత్త కాన్సెప్ట్. ట్రైలర్ కట్ చేయడం కూడా చాలా ట్రిక్కీ. సినిమాలోని సర్ప్రైజ్లను ట్రైలర్ ద్వారా చెప్పడం కష్టం. ప్రేక్షకులు నేరుగా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. -‘పుష్పక విమానం’ను చాలామంది సైలెంట్ సినిమా అనుకుంటారు. కానీ సింగీతం గారు కావాలని సైలెంట్ సినిమా తీయలేదు. ఆ సినిమాలో మాట్లాడే అవకాశం రాకుండా పరిస్థితులను సృష్టించారు. అదే ఆయన గొప్పతనం. అలాగే ఇందులో కూడా కావాలని మ్యూజికల్ సినిమా చేయలేదు. అది ఎలా సహజంగా జరిగిందో సినిమా చూస్తే తెలుస్తుంది. -ఈ సినిమా చేయాలనే కోరిక సింగీతం గారికి చాలా కాలంగా ఉంది. ఆయన దగ్గర వేరే కథలు ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ ఈ కథ దగ్గరికే వచ్చేవారు. అలాంటి జీనియస్ దర్శకుడి విజన్కు సపోర్ట్ చేయాలనుకున్నాను. -‘పుష్పక విమానం’ సమయంలో కమల్ హాసన్ గారి సపోర్ట్ లేకపోతే ఆ సినిమా జరిగేదో లేదో తెలియదు. ఇప్పుడు నాకు నిర్మాతగా సామర్థ్యం ఉంది కాబట్టి సింగీతం గారికి అవసరమైన ప్రతిదీ అందించడానికి ప్రయత్నించాను. సింగీతం గారి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? -ఆయన ఎప్పుడూ తనను తాను చాలా సీరియస్గా తీసుకోరు. ‘ఆదిత్య 369’ నా ఫేవరెట్ సినిమా. దానికి సీక్వెల్ చేద్దామని ఒకసారి ఆయనను కలిశాను. నిర్మాతగా నేను ఉంటానని చెప్పాను. కానీ ఆయన ‘ఆ కథ అయిపోయింది కదా, ఇంకేం ఉంటుంది? నా దగ్గర కొత్త కథలు ఉన్నాయి’ అన్నారు. సక్సెస్ వచ్చిందని దానికి సీక్వెల్ తీయాలనే లెక్కలు ఆయనకు ఉండవు. టైటిల్ ఐడియా ఎవరిది? -డిస్కషన్లో వచ్చింది. సింగీతం గారికి చెప్పగా ఆయనకు బాగా నచ్చింది. నిజానికి ఈ టైటిల్ లోగోలో ఆయన సిగ్నేచర్ను ఉపయోగించాం. జెన్-జీ ప్రేక్షకులకు సింగీతం గారి గురించి తెలుసా? -‘మహానటి’ తీసేటప్పుడు కూడా సావిత్రి గారి గురించి కొత్త తరానికి ఎంత తెలుసో తెలియదు. కానీ మంచి సినిమా అయితే చూస్తారు. దర్శకుడు ఎవరో తెలియకపోయినా సినిమాను సినిమాగానే చూస్తారు. ఈ సినిమా కమర్షియల్గా కూడా పెద్ద బ్లాక్బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం. వైజయంతి మూవీ, మీరంతా వున్నారని ఈ సినిమా ఓటీటీ కోసం చేశారా? -అసలు కాదు. కోవిడ్ సమయంలో కూడా మేము ‘జాతిరత్నాలు’ను థియేటర్లలో విడుదల చేశాం. మాకు థియేటర్లు, ప్రేక్షకులంటే ప్రేమ. కొంత డబ్బు ఎక్కువ వస్తుందని ఓటీటీకి వెళ్లే బ్యాచ్ కాదు మేము. ఈ సిమ్నిమ ఈ తరం ప్రేక్షకులకు ఒక గిఫ్ట్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. సినిమా చూసిన తర్వాత సినిమా సోల్ గురించి, హార్ట్ గురించి మాట్లాడతారు. నేను ఈ సినిమాను దాదాపు వందసార్లు చూశాను. ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. అందుకే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉంది.