
తనపై దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలను నటి వరలక్ష్మీ శరత్కుమార్ తిప్పికొట్టారు. ఆయన దర్శకత్వంలో ఆమె నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం జూన్ 12న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కు
వరలక్ష్మి సహకరించలేదని, డబ్బులు తీసుకొని కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని దర్శకుడు ఇటీవల ఆరోపించారు.
ఈ వివాదంపై వరలక్ష్మి స్పందిస్తూ... చిత్ర బృందానికి అవసరమైనప్పుడల్లా తాను అందుబాటులోనే ఉన్నానని, సినిమాకు సంబంధించిన వేడుకల్లో పాల్గొన్నానని స్పష్టం చేశారు. వేదికపై దర్శకుడు ఏం మాట్లాడారో తనకు పూర్తిగా తెలియదన్నారు.
కొన్ని విషయాల్లో తనకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయని, అందుకే చిత్రబృందం చేస్తున్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించి వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేదని తెలిపారు. తాను అందరిలా ఆరోపణలు చేయలేనని పేర్కొన్నారు. తన పని తాను చూసుకుంటూ ముందుకు వెళతానని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన నోట్ ద్వారా స్పష్టం చేస్తూ ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.