
Mega Daughter Sreeja:మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాల కారణంగా ఆమె తరచూ సోషల్ మీడియాలో, వార్తల్లో కనిపించేవారు
. ప్రస్తుతం మాత్రం ఆమె తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
చిరంజీవి కూతురు శ్రీజ ఒక వీడియో ద్వారా తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా యోగా మరియు ఆధ్యాత్మిక ప్రయాణం తన జీవితాన్ని ఎలా మార్చిందో వివరించారు.శ్రీజ మాట్లాడుతూ, "ఈ ప్రోగ్రామ్ను ప్రారంభించినప్పుడు నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. 'నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేను ఎందుకు ఇంత బాధను అనుభవిస్తున్నాను? ఒక సమస్య తర్వాత మరో సమస్య ఎందుకు వస్తోంది?' అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. నేను బాధితురాలిని అనే భావనలో ఉండేదాన్ని" అని చెప్పారు.ఆమె ఇంకా మాట్లాడుతూ, "ఈ ప్రయాణం ద్వారా నా ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. జీవితం నాకు జరిగిపోతున్న విషయం కాదని, నా జీవితాన్ని నేను కూడా నిర్మించుకోగలనని అర్థమైంది. ఆ అవగాహన నాకు ఎంతో స్పష్టతను ఇచ్చింది" అన్నారు.
తన గురించి తాను కొత్తగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించిందని శ్రీజ చెప్పారు. "నా జీవితంలో జరిగిన బాధలు, గత సంఘటనలే నా వ్యక్తిత్వమని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు బాధ నా జీవితంలో ఒక భాగమే తప్ప, అదే నా మొత్తం వ్యక్తిత్వం కాదని తెలుసుకున్నాను. నాలో ఇంకా ఎన్నో మంచి కోణాలు ఉన్నాయని గుర్తించాను" అని తెలిపారు.
యోగా తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని శ్రీజ వెల్లడించారు. "కృష్ణమాచార్య యోగా ద్వారా మనసు, శ్వాస, శరీరం ఒకే దారిలో నడవడం నేర్చుకున్నాను. నాపై నేను మరింత ప్రేమతో, దయతో ఉండడం అలవాటు చేసుకున్నాను. నా శ్వాసతో, శరీరంతో మరింత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను" అని చెప్పారు.
అలాగే తన యోగా గురువు శ్రావి, ఉషా అనురాధతో పాటు మొత్తం బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. "ఈ అనుభవం నా జీవితంలో అత్యంత విలువైన ప్రయాణాల్లో ఒకటి. నా జీవితాన్ని మార్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని శ్రీజ పేర్కొన్నారు.
శ్రీజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఆమె తనలో వచ్చిన మార్పును పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.