Cash Loans: మనకు ఏదైనా ఆర్థిక అత్యవసరం ఏర్పడినప్పుడు డబ్బుల కోసం ముందుగా గుర్తొచ్చేది స్నేహితులు, బంధువులే. బ్యాంకుల్లో అప్పు తీసుకునేందుకు తిరిగే ఓపిక ఉండదు. చాలా డాక్యుమెంట్లు ఇవ్వాలి, ఆర్థిక
పరిమైన అంశాల్లో సరిగ్గా ఉన్నప్పుడే బ్యాంకులు ఇస్తాయి. దీంతో చాలా మంది తెలిసిన వారి వద్ద లక్షల్లో నగదు రూపంలో చేబదులు తీసుకుంటారు. కానీ, ఇలా ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గర తీసుకునే నగదు రూపంలోని అప్పులపై ఆదాయం పన్ను శాఖ (Income Tax Department) పరిమితి విధించింది. ఈ విషయాన్ని చాలా మందికి తెలియదు. ఆ లిమిట్ దాటి ఒక్క రూపాయి నగదు రూపంలో తీసుకున్నా.. 100 శాతం పెనాల్టీ పడుతుంది. మీరు విన్నది నిజమే రూ. 5 లక్షలు అప్పుగా తీసుకుంటే, మరో రూ. 5 లక్షలు జరిమానా పడుతుంది. ఈ ట్యాక్స్ రూల్ వెనుక ఉన్న అసలు విషయం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269SS. దీని ప్రకారం ఏ వ్యక్తైనా మరో వ్యక్తి నుంచి రూ. 20,000 ఆపైన ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో అప్పుగా తీసుకోకూడదు. చాలా మంది చేసే పొరపాటు ఈ రూల్స్ కేవలం బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తాయని, ఇంట్లోని వాళ్లకు, స్నేహితులకు వర్తించవని భావిస్తారు. కానీ చట్టం ముందు అంతా సమానమే. అప్పు ఇచ్చేది మీ సొంత అన్నదమ్ములైనా, ప్రాణ స్నేహితులైనా రూ.20 వేల పరిమితి దాటితే అది కచ్చితంగా ఐటీ రూల్స్ ఉల్లంఘన కిందకే వస్తుంది.ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే అప్పు తీసుకున్న వాళ్లే కాదు, ఇచ్చిన వాళ్లూ చిక్కుల్లో పడతారు. 'నగదు రూపంలో అప్పు ఇచ్చినప్పుడు ఐటీ శాఖ నోటీసు ఇస్తే, తీసుకున్న వ్యక్తితో పాటు ఇచ్చిన వ్యక్తిని సైతం విచారిస్తారు. డబ్బు ఇచ్చిన వారికి ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఆదాయ వనరులు ఏంటి? అని అడుగుతారు. సరైన ఆధారాలు చూపించకపోతే ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటారు. రూ. 20,000 దాటిన ఏ నగదు ట్రాన్సాక్షన్ అయినా సరే చేయకూడదు. పూర్తిగా ఆన్లైన్ ట్రాన్స్ఫర్, చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోనే చేయాలి.' అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి రూ. 20,000 లిమిట్కు, మార్కెట్లో వినపడే రూ. 2 లక్షల లిమిట్కు మధ్య ఉన్న తేడా తెలియక అయోమయానికి గురువుతుంటారు. సెక్షన్ 269SS కేవలం అప్పులు, డిపాజిట్లకు పరిమితం. కానీ సెక్షన్ 267ST అనేది చాలా విస్తృతమైంది. దీని ప్రకారం ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి ఏ కారణం చేతనైనా (ఉదాహరణకు బంగారం కొనడం, ఆస్తి విక్రయించడం, వ్యాపార లావాదేవీల కోసం) రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదుగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే తీసుకున్న వ్యక్తిపై భారీ పెనాల్టీ పడుతుంది.ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఐటీ శాఖ ఎలా ట్రాక్ చేస్తుంది? అనే అనుమానం మీకు రావచ్చు. మనం ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేదా బిజినెస్ ఆడిట్ జరిగితే లేదా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS) పరిశీలించినప్పుడు ఈ లూప్ హోల్స్ బయటకు వస్తాయి. ఒకరు తమ అకౌంట్ బుక్కులో అప్పు ఇచ్చినట్లు చూపిస్తూ, మరొకరు దాన్ని దాస్తే ఐటీ స్కానర్లో ఈజీగా దొరుకుతారు. కాబట్టి, అత్యవసర సమయాల్లో ఎంతటి నమ్మకస్తుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నా డిజిటల్ విధానంలోనే లావాదేవీలు పూర్తి చేయాలి.