
జగన్ వ్యాఖ్యలపై సానా సతీష్ ఘాటు విమర్శలు, మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్న రాజ్యసభ సభ్యుడు.. Sana Satish: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మహిళల గురించి మాట్లాడటం రాజకీయంగా
విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ విమర్శించారు. మహిళా సాధికారతపై మాట్లాడే ముందు తన రాజకీయ ప్రస్థానాన్ని జగన్ ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. తన సొంత తల్లి, చెల్లి పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి లభించిన 11 రాజ్యసభ స్థానాల్లో ఒక్క మహిళకైనా అవకాశం ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. మహిళల అభ్యున్నతి గురించి ఇప్పుడు మాట్లాడుతున్న జగన్, అధికారంలో ఉన్నప్పుడు మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాటల్లో మహిళల పట్ల ప్రేమ చూపించడం కాకుండా, ఆచరణలో నిరూపించాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందని అన్నారు.
ఇటీవల మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ చేసిన కీలక ప్రకటనను సానా సతీష్ ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ ప్రకటించారని గుర్తు చేశారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు తీసుకుంటున్న ఈ నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని తెలిపారు. అదే సమయంలో ఈ ప్రకటనతో జగన్ దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారని విమర్శించారు.
తన తల్లి విజయమ్మను విశాఖపట్నం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించి ఓడిపోయే పరిస్థితి తీసుకురావడమే కాకుండా, అనంతరం పార్టీ కార్యక్రమంలో రాజీనామా చేయించే వరకు పరిస్థితులను తీసుకెళ్లిన వ్యక్తి జగన్ అని సానా సతీష్ ఆరోపించారు. కుటుంబ సభ్యులనే రాజకీయంగా పక్కన పెట్టిన నాయకుడు ఇప్పుడు మహిళల సంక్షేమం గురించి మాట్లాడటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.
అంతేకాకుండా, మహిళల పట్ల తనకున్న నిబద్ధతను చాటుకోవడానికి బదులుగా అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మహిళల పేరుతో తప్పుడు కథనాలు సృష్టించడం, విషప్రచారం చేయించడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
తల్లి, చెల్లినే రాజకీయంగా మరియు వ్యక్తిగతంగా దూరం చేసినప్పుడు జగన్కు మహిళల గౌరవం గుర్తుకు రాలేదా అని సానా సతీష్ ప్రశ్నించారు. మహిళల గురించి మాట్లాడే ముందు తన గత వైఖరిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారని, మహిళల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఎవరిదో రాబోయే రోజుల్లో మరింత స్పష్టమవుతుందని సానా సతీష్ అన్నారు.
రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.