
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరి ప్రధాన ఆహారం. దీన్ని పండించడానికి భారీగా నీరు అవసరం. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో లోటుపాట్లు వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరి ప్రధాన ఆహారం. దీన్ని పండించడానికి భారీగా నీరు అవసరం. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో లోటుపాట్లు వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కరవును తట్టుకునే, అతి తక్కువగా నీటిని వినియోగించే వరి రకాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఈ విషయంలో గణనీయ పురోగతి సాధించినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. బ్రిటన్ సైతం ఈ దిశగా కీలక అడుగులు వేస్తోంది. వేడెక్కుతున్న నేటి ప్రపంచంలో.. వ్యవసాయానికి ఇదో శుభవార్త.
కరవును తట్టుకోగలిగి, తక్కువ నీటితో వరి పండడానికి దోహదపడే కీలకమైన హెచ్ఎంజీబీ1 జన్యువును చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 16 వరి రకాల(సగం మెట్ట, సగం నీటిపారుదల)పై అధ్యయనం చేసి, వాటి వేర్లు, జన్యు కార్యకలాపాలను విశ్లేషించారు. వేర్ల అభివృద్ధికి దోహదపడే 376 జన్యువులను గుర్తించారు. ఇందులో హెచ్ఎంజీబీ1 వీరి పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించింది. వేర్ల పెరుగుదలను ఈ జన్యువు నెమ్మదింపజేస్తుంది. నీటి కోసం భూమి లోతుల్లోకి వెళ్లే వేర్లకు అడ్డుకట్ట వేస్తుంది. పొడి ప్రాంతాల్లో మనుగడ సాగించేలా మందపాటి వేర్లు పెరగడానికి ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వేర్లు నిటారుగా భూమిలోకి చొచ్చుకుపోవడానికి హెచ్ఎంజీబీ1 జన్యువు బ్రేకులా అడ్డుకట్ట వేస్తుంది కాబట్టి ఉన్నచోటే ఆ వేర్లు మందంగా, బలంగా తయారవుతాయి. ఇది మొక్కకు కరవును తట్టుకునే శక్తిని బాగా పెంచుతుందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రచురించింది. యాదృచ్ఛికంగా మొక్కలను సంకరం చేయడానికి బదులుగా, నిర్దిష్ట జన్యువులను లక్ష్యంగా చేసుకుని ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ పరిశోధన దోహదపడుతుంది. హువాజోంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీజీఐ-రీసెర్చ్, యునాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.
వాతావరణ మార్పులను తట్టుకునే జన్యు వైవిధ్య వరి మొక్కల అభివృద్ధిపై బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం సట్టన్ బోనింగ్టన్ క్యాంపస్ గ్రోత్ రూమ్స్లో పెద్దఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. వేడి ఒత్తిడికి, కరవుకు వివిధ మొక్కలు ఎలా స్పందిస్తాయన్న దానిని ఇక్కడ అధ్యయనం చేస్తున్నారు. వాతావరణ మార్పులకు వేర్లు దెబ్బతినకుండా ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి వర్సిటీలోని హాన్స్ఫీల్డ్ ఫెసిలిటీలో వరి మొక్కలను మైక్రో-సీటీ స్కానర్లో విశ్లేషిస్తున్నారు. లోతుగా, నిటారుగా పెరిగే వేర్లు భూమి లోతుల్లోకి వెళ్లి ఎక్కువ నీటిని సంగ్రహిస్తాయి. దాన్ని నియంత్రించే జన్యువును గుర్తించి, కొత్త రకాల అభివృద్ధిలో వినియోగించుకుంటామని హాన్స్ఫీల్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రెయిగ్ స్టర్రాక్ చెప్పారు.
ప్రపంచంలో దాదాపు 75% వరి ఉత్పత్తికి నీటిపారుదలే ఆధారం. చైనాలో వ్యవసాయానికి అవసరమైన నీటిలో 70 శాతాన్ని వరి పంటకే వినియోగిస్తున్నారు. వరిని అత్యధికంగా పండించే ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్లాండ్లలో నీటిపారుదల కోసం భారీగా డబ్బు వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజా పరిశోధనలు వరి రైతుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. ప్రపంచ ఆహార భద్రతకు సరికొత్త భరోసా ఇస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.