
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనపై వస్తున్న రాజకీయ ఊహాగానాలకు తెరదించాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున లోక్సభ ఎంపీ యూసఫ్ పఠాన్తో తాను రాయబారం చేశానంటూ వస్తున్న వార్తలను ఆయన
తీవ్రంగా ఖండించాడు. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, అవన్నీ కల్పితాలని ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారన్న నేపథ్యంలో, ఆమెను ఉప ఎన్నిక ద్వారా పార్లమెంటుకు పంపేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా బహరంపూర్ ఎంపీ యూసఫ్ పఠాన్ను రాజీనామా చేయమని కోరినట్లు ఓ బెంగాలీ పత్రికలో కథనం వెలువడింది. ఈ విజ్ఞప్తిని మమతా బెనర్జీ తరఫున సౌరవ్ గంగూలీనే యూసఫ్ పఠాన్కు చేరవేశారని ఆ కథనం పేర్కొంది.ఈ కథనాలపై గంగూలీ తీవ్రంగా స్పందించాడు. "నిజానిజాలు తెలుసుకోకుండా అత్యంత నిర్లక్ష్యంగా ఈ వార్తలు రాశారు. యూసఫ్ పఠాన్కు సందేశం పంపమని మమతా బెనర్జీ నన్ను ఎప్పుడూ కోరలేదు. నేను పఠాన్ను సంప్రదించనూ లేదు. రాజకీయపరమైన విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు" అని గంగూలీ తన ప్రకటనలో వివరించాడు. వాస్తవాలు ధృవీకరించుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని మీడియాకు హితవు పలికాడు.కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరిపై గెలిచి యూసఫ్ పఠాన్ గత సార్వత్రిక ఎన్నికల్లో బహరంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికవడం తెలిసిందే. అయితే, ఈ వివాదంపై యూసఫ్ పఠాన్ గానీ, మమతా బెనర్జీ గానీ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.