బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయి ఇండస్ట్రీలో నడుస్తున్న భారీ బడ్జెట్ ప్రచారాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన హీరోగా నటించిన తాజా ఫైనాన్షియల్
థ్రిల్లర్ మూవీ ‘గవర్నర్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్న పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్ల హడావుడి, వందల కోట్ల బడ్జెట్ లెక్కలపై ఆయన గళమెత్తారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ‘వారణాసి’ చిత్రానికి రూ. 1400 కోట్లు, అలాగే నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ ప్రాజెక్టుకు రూ. 4000 కోట్ల వ్యయం అవుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ భారీ అంకెలు, బడ్జెట్ లెక్కలన్నీ కేవలం సినిమాలకు హైప్ తీసుకురావడానికి మేకర్స్ ప్లే చేసే పీఆర్ స్టంట్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. గత పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఇలాంటి కృత్రిమ హడావుడిని తాను గమనిస్తున్నానని మండిపడ్డారు.* ‘పెద్ది’ నుంచి ఆ సీన్స్ తొలగింపు... క్షమాపణలు చెబుతూ బుచ్చిబాబు ఎమోషనల్ ట్వీట్ సినిమా నిర్మాణం అనేది పూర్తిగా ఒక వ్యాపారమని, ఎంత పెట్టుబడి పెట్టాలి, దాన్ని ఎలా లాభాలుగా మార్చుకోవాలి అనేది పూర్తిగా సదరు నిర్మాత వ్యక్తిగత విషయమని మనోజ్ బాజ్పేయి స్పష్టం చేశారు. చిత్ర నిర్మాణానికి పెట్టే వందల కోట్ల రూపాయల్లోంచి ఒక్క పైసా కూడా సామాన్య ప్రేక్షకుల జేబుల్లోకి గానీ, వారి ఖాతాల్లోకి గానీ రాదని, అంతా తిరిగి మేకర్స్ అకౌంట్లకే వెళ్తుందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ప్రేక్షకులకు ఈ బిజినెస్ లెక్కలతో పనేంటని ప్రశ్నించారు. సినిమా చూశాక అది నచ్చిందా లేదా అనేదే వీక్షకుడికి ముఖ్యం కావాలని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారిపోయిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయాల్లో సామాన్యులు తారసపడినప్పుడు సినిమా కథ బాగుందా లేదా అని అడగకుండా, కలెక్షన్లు ఎన్ని కోట్లు వచ్చాయి, బాక్సాఫీస్ రికార్డులు ఎలా ఉన్నాయి అనే విషయాలనే అడుగుతున్నారని చెప్పారు. కలెక్షన్ల మాయలో పడకుండా కేవలం కంటెంట్ ఆధారంగానే సినిమాలను ఆదరించాలని ఆయన ప్రేక్షకులకు సూచించారు.* తారక్ చేతి వంట... కుకీస్ అడిగిన అభిమానికి అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్! మనోజ్ బాజ్పేయి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు భిన్న శైలిలో స్పందిస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘గవర్నర్’ సినిమాపై మార్కెట్లో పెద్దగా అంచనాలు లేవని, అందుకే జనాకర్షణ కోసం, తన సినిమా ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగానే రాజమౌళి, రణ్బీర్ కపూర్ వంటి అగ్ర సెలబ్రిటీల ప్రాజెక్టులను ఆయన టార్గెట్ చేశారంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందీతో పాటు టాలీవుడ్లోనూ మనోజ్ బాజ్పేయికి మంచి గుర్తింపు ఉంది. గతంలో అల్లు అర్జున్ ‘హ్యాపీ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా ఆయన పండించిన కామెడీ, నటన తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయాయి. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్తో ఓటీటీ వేదికపై సంచలనం సృష్టించి ఇటీవల ‘భయ్యాజీ’ చిత్రంతో అలరించారు. ఇప్పుడు ‘గవర్నర్’ ప్రమోషన్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమ వెనుక ఉన్న పీఆర్ మాయాజాలాన్ని ఎండగట్టేలా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.