
మన జేబుల్లో ఉండే కరెన్సీ నోట్లు త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతున్నాయా? చిరిగిపోని, నీళ్లలో నానినా పాడవని ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను భారత్లో ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
మన జేబుల్లో ఉండే కరెన్సీ నోట్లు త్వరలోనే సరికొత్త రూపంలోకి మారబోతున్నాయా? చిరిగిపోని, నీళ్లలో నానినా పాడవని ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కసరత్తు చేస్తోందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగిసిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉందని, దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పాలిమర్ నోట్ల అంశం ప్రస్తుతం మా పరిశీలనలో ఉంది. దీనివల్ల కలిగే లాభనష్టాలను మేము నిశితంగా బేరీజు వేస్తున్నాము అని మల్హోత్రా పేర్కొన్నారు.అసలు ఏమిటీ పాలిమర్ నోట్లు? వీటి ప్రత్యేకత ఏంటి?సాధారణంగా మనం వాడే కరెన్సీ నోట్లను కాటన్ పల్ప్ పేపర్‌తో తయారు చేస్తారు. కానీ, పాలిమర్ నోట్లను ఒక ప్రత్యేక రకమైన ప్లాస్టిక్ సబ్‌స్ట్రేట్‌తో గుర్తింపు పొందేలా రూపొందిస్తారు. ఈ సరికొత్త టెక్నాలజీని మొట్టమొదట ఆస్ట్రేలియా దేశం ప్రవేశపెట్టగా.. ప్రస్తుతం బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్ వంటి అనేక ప్రపంచ దేశాలు విజయవంతంగా వాడుతున్నాయి. సాధారణ నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు తేమను, ధూళిని, మురికిని సమర్థవంతంగా తట్టుకోగలవు. ఇవి చాలా ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండటం వల్ల, మార్కెట్లో తరచుగా పాత నోట్లను మార్చాల్సిన తలనొప్పి తగ్గుతుంది.ప్రతి ఏటా 2 లక్షల నోట్లు అవుట్!మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల వరకు పాడైపోయిన, మురికిగా మారిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుని ధ్వంసం చేస్తోంది. ఇందులో ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే రూ. 100, రూ. 500 విలువైన నోట్లే ఎక్కువగా దెబ్బతింటున్నట్లు బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం.. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే కనీసం రెండు నుంచి ఐదు రెట్ల వరకు ఎక్కువ కాలం చెలామణిలో పటిష్టంగా ఉంటాయని తేలింది. సంక్షేమ పథకాలకు ఈ-రూపాయి, సబ్సిడీలపై ఆర్‌బీఐ సంచలన ఆర్డర్!నకిలీ నోట్ల మాఫియాకు గట్టి చెక్!దేశంలో నకిలీ కరెన్సీ (ఫేక్ నోట్ల) సమస్యను అరికట్టడంలో పాలిమర్ నోట్లు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్లాస్టిక్ నోట్లలో ప్రత్యేకమైన పారదర్శక కిటికీలు (transparent windows), అత్యాధునిక హోలోగ్రామ్‌లు, రంగులు మారే ప్రత్యేక భద్రతా ఫీచర్లను సులభంగా అమర్చవచ్చు. దీనివల్ల ఈ నోట్లను ఫోర్జరీ చేయడం లేదా నకిలీవి తయారు చేయడం సామాన్య కాగితపు నోట్ల కంటే అత్యంత కష్టతరంగా మారుతుంది.భారత్‌లో పాలిమర్ నోట్ల హిస్టరీ ఇదీ..భారతదేశంలో పాలిమర్ కరెన్సీని తీసుకురావడంపై ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాదు; దీనికి సుదీర్ఘ చర్చల చరిత్రే ఉంది. ఆర్బీఐ 2007లోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేయగా, గతంలో జైపూర్, భువనేశ్వర్ వంటి కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుల రూపంలో ప్రయోగాత్మకంగా వీటిని పరిశీలించారు. ఆ తర్వాత 2016లో కూడా పాలిమర్ నోట్ల సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపినప్పటికీ, అవి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చెలామణిలోకి రాలేకపోయాయి. రేపటి కోసం డాలర్‌తో రూపాయి ఫైట్! ప్రస్తుతం కరెన్సీ నోట్ల మన్నికను పెంచడానికి ఆర్బీఐ వార్నిష్డ్ నోట్ల (varnished notes) రూపంలో కూడా కొన్ని ప్రయోగాలు చేస్తోంది. ఏదేమైనా, పాలిమర్ నోట్లను దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టే అంశంపై ఆర్బీఐ ఆలోచన ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.10, 20 పాలీమర్‌ నోట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి ముందడుగు పడుతుందో వేచి చూడాలి!