
భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఈ
భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని, అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.దేశంలో పేపర్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. కాగితపు నోట్ల ముద్రణకు భారీగా ఖర్చు అవ్వడం, అవి త్వరగా పాడైపోయి చలామణి నుంచి తొలగించాల్సి రావడం వంటి కారణాల వల్లే ఈ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, ఆపరేషనల్ సమస్యలపై ఆర్బీఐ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.నిజానికి, ప్లాస్టిక్ నోట్ల ప్రస్తావన ఈనాటిది కాదు. 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటుకు సమాచారం అందించింది. భౌగోళిక, వాతావరణ వైవిధ్యాలను పరీక్షించడానికి దేశవ్యాప్తంగా ఐదు నగరాలను (కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్) ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా రూ. 100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని భావించారు. కానీ, అప్పట్లో కొన్ని సాంకేతిక, నిర్వహణ లోపాల వల్ల ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆర్బీఐ మళ్లీ ఈ ఫైల్ను కదిలించడంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.