
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల సందడి మందగించింది. వాటి రాక ఆలస్యం కావడం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఇప్పటికే దీని ప్రభావం పడింది కూడా.
315 జిల్లాల్లో సగటు కంటే 43 శాతం లోటు వర్షం కురిసింది. ఇప్పటికీ ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండట్లేదు గానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తీపికబురు ఇచ్చింది. బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా ఉత్తర ప్రాంతం, పశ్చిమ బెంగాల్ దక్షిణ తీరప్రాంతాల వరకూ ఇది విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో ఈ అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయని, దీనివల్ల కోస్తాంధ్ర అంతటా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉన్నందున, ఏపీ తీర ప్రాంతాల్లో గాలి తీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించారు.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
నేడు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. ఈ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసినట్లు చెప్పారు. అలాగే మత్స్యకారులెవరూ కూడా సముద్రంపై చేపలవేటకు వెళ్ళరాదని సూచించారు. తీర ప్రాంతంలో నివసించే మత్స్యకార గ్రామాల ప్రజలు సముద్రపు అలల తీవ్రతను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.