ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా, శ్రీలంకలో భారత్ ఆడబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది.
ఆగస్టులో జరగనున్న ఈ సిరీస్లో మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలేలోని గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి ఆట ప్రారంభం కానుంది. 2017 తర్వాత భారత్ శ్రీలంకలో ఆడబోయే మొదటి టెస్ట్ సిరీస్ ఇదే కావడం విశేషం.కాగా టీమిండియా చివరిసారి 2017లో శ్రీలంకలో టెస్టు మ్యాచ్లు ఆడింది. అప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్.. మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో శ్రీలంక గడ్డపై భారత్ ఆడబోయే తొలి సిరీస్ ఇదే. 2025-27 డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మెరుగైన స్థానానికి వెళ్లాలంటే.. ఇరు జట్లకూ ఈ సిరీస్ కీలకం కానుంది.ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్స్కు చేరినప్పటికీ డబ్ల్యూటీసీ టైటిల్ను గెలవని భారత్ ప్రస్తుతం పట్టికలో ఐదవ స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరోవ స్థానంలో ఉంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో భారత్ న్యూజిలాండ్లో కూడా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికాక.. శుభ్మన్ గిల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. గిల్ సారథ్యంలో భారత్.. ఇంగ్లాండ్తో తొలి సిరీస్ ఆడింది. ఆ సిరీస్ను 2-2తో ముగించింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్పై సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. కానీ, గత ఏడాది సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది.ముఖ్యంగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్.. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్ల సామర్థ్యంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఇప్పుడు సొంత గడ్డపై శ్రీలంక స్పిన్నర్లు భారత బ్యాటర్లకు మరో కఠినమైన సవాలును విసరనున్నారు.