
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులపై ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు అందరూ కేవలం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించే మాట్లాడుకున్నారు.
కానీ, ఇప్పుడు జీతాల సవరణను శాసించే మరో ముఖ్యమైన విషయం తెరపైకి వచ్చింది. అదే ఫ్యామిలీ యూనిట్.
కనీస వేతనాన్ని నిర్ణయించడానికి ఈ ఫ్యామిలీ యూనిట్ లెక్కింపు చాలా కీలకం. ఈ లెక్కింపులో మార్పులు వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘానికి సంబంధించిన అప్డేట్లను క్రమంగా పంచుకునే ఒక ఎక్స్ ఖాతా దీనిపై ఆసక్తికరమైన లెక్కలను వెల్లడించింది.
7వ వేతన సంఘం కనీస వేతనాన్ని లెక్కించే సమయంలో ఫ్యామిలీ యూనిట్ను 3.0 గా తీసుకుంది. దానికి బదులుగా 4.6 గా తీసుకుని ఉంటే, కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000 కు బదులుగా ఏకంగా రూ. 27,600 గా ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.94 గా మారేది. 7వ వేతన సంఘం అమలు చేసిన 2.57 తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ మార్పు గనుక జరిగి ఉంటే ఉద్యోగుల జీతాలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగి ఉండేవని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.
7వ వేతన సంఘం కాలంలో ఫ్యామిలీ యూనిట్ను ప్రభుత్వ ఉద్యోగి (1.0), జీవిత భాగస్వామి (0.8), ఇద్దరు పిల్లలు (ఒక్కొక్కరు 0.6 చొప్పున 1.2) మొత్తంగా 3.0 గా లెక్కించారు. అయితే, ఇందులో ఉద్యోగిపై ఆధారపడి జీవించే వృద్ధాప్య తల్లిదండ్రులను లెక్కలోకి తీసుకోలేదు. ప్రస్తుత రోజుల్లో కుటుంబ బాధ్యతలు, ఖర్చులు పెరిగాయి కాబట్టి, 8వ వేతన సంఘం ఈ ఫ్యామిలీ యూనిట్ను 4.6 నుండి 5.0 కి పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ స్టాఫ్ సైడ్ కూడా తమ మెమోరాండంలో ఈ ఫ్యామిలీ యూనిట్ కౌంట్ను పెంచాలని అధికారికంగా డిమాండ్ చేసింది. దీనివల్ల నేటి తరం ఉద్యోగుల గృహ బాధ్యతలకు సరైన న్యాయం జరుగుతుందని వారు వాదిస్తున్నారు.
ఈ విషయంపై బ్యాంక్బజార్ సీఈఓ అధిల్ శెట్టి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ జీవన వ్యయాన్ని అంచనా వేయడానికి వేతన సంఘం ఉపయోగించే ముఖ్యమైన సూత్రాలలో ఫ్యామిలీ యూనిట్ ఒకటి అని ఆయన ఒక మీడియా ఛానెల్ తో అన్నారు.
"ఒకవేళ ఉద్యోగ సంఘాలు కోరినట్లుగా 8వ వేతన సంఘం ఈ ఫ్యామిలీ యూనిట్ను పెంచితే, కనీస జీవన వ్యయ అంచనా కూడా పెరుగుతుంది. ఇది నేరుగా కనీస ప్రాథమిక వేతనంపై ప్రభావం చూపుతుంది. మన వేతన వ్యవస్థ అంతా ఈ కనీస వేతనం ఆధారంగానే నిర్మితమైంది కాబట్టి, ఇందులో ఎలాంటి మార్పు వచ్చినా అది అన్ని స్థాయిల ఉద్యోగుల జీతాలను పెంచుతుంది" అని ఆయన అన్నారు.
గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులపై కుటుంబ బాధ్యతలు బాగా పెరిగాయి. పెరుగుతున్న వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల ధరల వల్ల భార్యాపిల్లలతో పాటు వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఉదాహరణకు, 7వ వేతన సంఘం నాటి పద్ధతినే వాడుతూ ఫ్యామిలీ యూనిట్ను 4.6 గా తీసుకుంటే, కనీస వేతనం రూ. 18,000 నుండి రూ. 27,600 కి చేరుకుంటుందని అంచనా.
అయితే, ఈ ఫ్యామిలీ యూనిట్ మార్పుపై 8వ వేతన సంఘం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం, అది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల జీతాలలో ఊహించని మార్పులకు కారణం అవుతుంది. జీతాల మ్యాట్రిక్స్ మొత్తం ఈ బేంచ్మార్క్తో ముడిపడి ఉండటం వల్ల, ఉద్యోగుల అకౌంట్లలోకి భారీగా డబ్బులు చేరడం ఖాయం.