
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Rythu Bharosa: ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులు, భూ యజమానులు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో మృగశిర కార్తె వచ్చినట్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో ఠంచనుగా పడిపోయేది. ఒక్కసారి రైతుబంధు వేయడం మొదలైతే ఏ రోజు ఏ రైతు ఖాతాలో, ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేది' అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు.
రైతు భరోసా పేరిట మరోసారి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు పీఆర్ స్టంట్లు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ మోసలు వివరిస్తూనే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఏమేం చేసిందనేది వివరించారు. 'రైతు భరోసా అమలు విషయంలో రేవంత్ సర్కార్ పిల్లిమొగ్గలు వేస్తుంది. ఎకరాకు రూ.15 వేలను రూ.12 వేలకు కుదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఒకసారి ఊర్ల వారీగా రైతు భరోసా వేశారు. అది గందరగోళంగా మారడంతో మళ్లీ ఎకరాల వారీగా వేశారు. దానిని కూడా మధ్యలోనే ఆపివేశారు' అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. గత యాసంగిలో అందరు రైతులకు అని చెప్పి రెండెకరాల వరకు వేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
'ఇప్పుడు రైతు భరోసా అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టింది. రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా వేయడానికి సభల పేరుతో వృథా ఖర్చులు ఎందుకు?' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. పంటల కొనుగోళ్ల విషయంలోనూ ఈ సర్కారు చేతులెత్తేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే కొంటామని చెప్పి బాధ్యతల నుంచి తప్పుకున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా యాప్ రైతులకు శాపంగా మారిందని చెప్పారు. ఈ వైఫల్యాల నుంచి రైతుల దృష్టిని మరల్చడానికి రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పీఆర్ స్టంట్లు చేస్తోందని విమర్శించారు. రైతులందరికీ రైతు భరోసా వేయాలని, గతంలో ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.