
India vs England T20I: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు మైదానం వెలుపల మాటల యుద్ధం మొదలైంది.
ఐర్లాండ్ పర్యటనలో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉండగా, ప్రత్యర్థి బౌలర్ జోఫ్రా ఆర్చర్ విసిరిన సవాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవం.. ఇంగ్లాండ్ టూర్లోనైనా మారేనా?
ఇటీవలే ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 0-2 తేడాతో క్లీన్స్వీప్ అయి తీవ్ర నిరాశలో మునిగిపోయింది. పసికూన చేతిలో దారుణంగా ఓడిపోయిన కసితో ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన భారత జట్టు, రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనుంది. చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగబోతోంది. ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టును బ్యాటింగ్ వైఫల్యాలు తీవ్రంగా వేధించాయి. ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై కూడా అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తే మరో సిరీస్ కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కేనా?
ఐర్లాండ్ పర్యటనలోనే యువ తుఫాన్, సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశం ఇచ్చి ఉంటే కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచేవాళ్లమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రేపటి నుంచి జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లోనైనా అతనికి తుది జట్టులో స్థానం కల్పిస్తారా అనేది ప్రస్తుతం పెద్ద మిస్టరీగా మారింది. ఎందుకంటే, సీనియర్ ఆటగాళ్ల వైపే మొగ్గు చూపుతామని ఇప్పటికే జట్టు యాజమాన్యం స్పష్టం చేసిన నేపథ్యంలో, వైభవ్ సూర్యవంశీ తొలి టీ20 ఆడటం దాదాపు కష్టమనే సంకేతాలు అందుతున్నాయి.
తొలి బంతికే అవుట్ చేస్తా.. ఆర్చర్ సంచలన హెచ్చరిక..!
ఈ ఉత్కంఠభరిత వాతావరణం మధ్య, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడినప్పుడు తన సహచరుడైన వైభవ్ సూర్యవంశీపై ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత, భారత జట్టు ఖచ్చితంగా వైభవ్కు తుది జట్టులో అవకాశం ఇస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఒకవేళ అతనికి గనుక అవకాశం ఇస్తే, తొలి టీ20 మ్యాచ్లో తాను వేసే మొదటి బంతికే అతన్ని అవుట్ చేస్తానంటూ ఆర్చర్ తీవ్రంగా హెచ్చరించాడు.
ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..
బలహీనతలు తెలుసు.. క్రీజులో ఉంటే మ్యాచ్ వన్ సైడే..!
ఐపీఎల్ సమయంలో వైభవ్ సూర్యవంశీతో కలిసి ఆడినందువల్ల అతని బలహీనతలు తనకు బాగా తెలుసని ఆర్చర్ పేర్కొన్నాడు. అతనికి ఎలాంటి బౌలింగ్ వేయాలి, ఎలాంటి బౌన్సర్లు విసరాలి, ఎంత త్వరగా పెవిలియన్కు పంపాలో తనకు పూర్తి అవగాహన ఉందని సవాలు విసిరాడు. అయినప్పటికీ, వైభవ్ తొలి మ్యాచ్ ఆడాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఒకవేళ వైభవ్ క్రీజులో గనుక కుదురుకుంటే మ్యాచ్ ఏకపక్షంగా మారిపోతుందని, అందుకే అతన్ని త్వరగా ఔట్ చేయడానికి అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్నానని ఆర్చర్ స్పష్టం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..