అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్ ప్రారంభం నుంచీ సాలిడ్ సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. ‘హలో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ, ఆయన కోరుకున్న బ్లాక్ బస్టర్ అయితే పడలేదు.
ఆయన్నుంచి చివరగా వచ్చిన ‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్ గా మారింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని, ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నార. తన నుంచి సినిమా రావడానికి మూడేళ్లు పట్టిందని, అందుకు అక్కినేని అభిమానులకు క్షమాపణలు చెప్పారు అఖిల్.అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లెనిన్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా మంగళవారం వైజాగ్ లో మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ ఈవెంట్ కు అఖిల్, భాగ్యశ్రీ హాజరయ్యారు.అఖిల్ మాట్లాడుతూ.. “నేను ఈరోజు ఎక్కువ మాట్లాడకూడదు. ఈసారి నేను కాదు, సినిమా మాట్లాడుతుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పను. నేను నిద్రపోయి రెండు రోజులు అయింది. అయినా కూడా మిమ్మల్ని చూసి ఎనర్జీ వచ్చింది. జులై 10 వరకూ పని చేయడానికి ఎనర్జీ ఇచ్చారు. మిమ్మల్ని చూసి ఇవాళ నేను మనస్పూర్తిగా ఆక్సిజన్ పీల్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. నా నుంచి సినిమా వచ్చి మూడేళ్లు అయింది. అందుకు సారీ బ్రదర్. క్షమించండి. మనస్పూర్తిగా గుండెపై చెయ్యి పెట్టి చెప్తున్నా.. ఈ సారి నమ్మండి” అని అన్నారు. మహాభారతంతో లెనిన్.. అఖిల్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా!భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “ఇప్పటి వరకూ ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్యూ సో మచ్. ఈ భారతికి (సినిమాలో తన క్యారెక్టర్ పేరు) లెనిన్ ప్రేమతో పాటు మీ ప్రేమ కూడా చాలా అవసరం. అఖిల్ కి, మొత్తం చిత్ర బృందానికి కృతజ్ఞతలు. జూలై 20న ఈ భారతి కోసం థియేటర్లలో సినిమా చూస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఇక అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్తో వచ్చిన ‘లెనిన్’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అఖిల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా రూరల్ మాస్ రోల్ లో అలరించారు.