ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ జూన్ 30న పదవీ విరమణ చేశారు. ఆయన రిటైర్మెంట్కు ముందు రోజు కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ నెల 29న ఏపీ ప్రభుత్వం సునీల్ కుమార్ పదవీ విరమణకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. సునీల్కు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు మాత్రం ఆయనపై ఉన్న ఆరోపణలపై వచ్చే తీర్పునకు అనుగుణంగా.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. పీవీ సునీల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్పై ఆయన భార్య పెనుమాక అరుణ ప్రభుత్వానికల లేఖ రాశారు. సునీల్కు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపేయాలని.. ఒకవేళ అవి చెల్లిస్తే తన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్నారు. అరుణ రాసిన లేఖకు కౌంటర్గా పీవీ సునీల్ కుమార్ ఇద్దరు కుమారులు ఏపీ ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. తమ తల్లి అరుణ రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కుమారులు రోహిత్ శౌర్య, హర్షల్ ఏపీ సీఎస్కు లేఖ రాశారు. తమ తండ్రి సునీల్కుమార్కు చట్టబద్ధంగా అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ నిలిపివేయాలనడం సరికాదన్నారు. తమ తల్లిదండ్రులు 2014లోనే వైవాహికంగా విడిపోయారని.. అప్పటి నుంచి తమ బాగోగులు తండ్రి పీవీ సునీల్ కుమారు చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తమ తల్లితో ఎలాంటి సంప్రదింపులు లేవని.. తాము ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నట్లు తెలిపారు. తమ చదువు, ఆర్థిక, ఇతర అవసరాల కోసం తండ్రిపైనే ఆధారపడ్డామని.. ఇలాంటి పరిస్థితుల్లో తమ తండ్రికి చట్టబద్ధంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ (ఉద్యోగ విరమణ బకాయిలు) నిలిపేయటం వల్ల ఆయనతో పాటు తాము నష్టపోతామన్నారు. తమ తల్లికి సంబంధించిన భరణం, మిగిలిన అంశాలు ఇప్పటికీ కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి చట్టపరమైన ప్రక్రియకు థర్ట్ పార్టీ ఆరోపణలు, ప్రైవేటు వినతుల ఆధారంగా ప్రతికూల నిర్ణయాలు తీసుకోవద్దని రోహిత్, హర్షల్ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. రెండు రోజుల క్రితం పీవీ సునీల్ కుమార్ భార్య ప్రభుత్వానికి లేఖ రాశారు. సునీల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తే తనకు ఇబ్బంది అవుతుందన్నారు. పీవీ సునీల్ కుమార్, భార్య అరుణ మధ్య విభేదాల కారణంగా విడిపోయారు.. అరుణ తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పీవీ సునీల్ కుమార్ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్గా పని చేశారు. అప్పటి ఎంపీ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామ ఫిర్యాదుతో గుంటూరులో సునీల్పై కేసు నమోదైంది. అలాగే ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి.. ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి రావడంపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో సునీల్కుమార్ను సస్పెన్షన్లో ఉంచింది.. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. జూన్ 30న ఆయన పదవీ విరమణ చేశారు. అంతేకాదు పీవీ సునీల్కుమార్కు క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్)లో ఊరట దక్కలేదు. సునీల్ సస్పెన్షన్ అంశంపై జోక్యం చేసుకోలేమని క్యాట్ హైదరాబాద్ బెంచ్ నిరాకరించింది.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.