టీటీడీకి వివిధ మార్గాలలో ఆదాయం వస్తోంది.. తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీలలో భక్తుల సమర్పించే కానుకలు, భక్తుల నుంచి విరాళాలు, లడ్డూల విక్రయం, బంగారం, వెండి, వాహనాలు, విలువైన వస్తువులు అందుతున్నాయి.
టీటీడీ భక్తుల సమర్పించే కొన్ని వస్తువుల్ని వేలం వేస్తుంది.. భక్తులు సమర్పించే వస్త్రాలు, మొబైల్స్, వాచ్లు, బియ్యం ఇలా ఎప్పటికప్పుడు వేలం నిర్వహిస్తోంది. అంతేకాదు తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే డ్రైఫ్రూట్స్, నెయ్యి సహా మిగిలిన ముడిసరుకులకు సంబంధించిన ఖాళీ డబ్బాలు, గోతం సంచుల్ని కూడా వేలం నిర్వహిస్తారు. ఇలా కూడా టీటీడీ ఆదాయాన్ని పొందుతోంది.తాజాగా టీటీడీ మరో వేలానికి సిద్ధమైంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో 01-04-2026 నుంచి 31-03-2027 వరకు జీడిపప్పు ప్యాకింగ్కు వినియోగించే ఖాళీ ప్లాస్టిక్ బకెట్లను సేకరించేందుకు జులై 7న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ– వేలం వేయనున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న బిడ్డర్లు ఈఎండీ పేరుతో రూ.25,000 చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో, టీటీడీ వెబ్సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ను సంప్రదించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనొచ్చు. అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజవాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయహస్తంతో అనుగ్రహించారు. వాహనసేవ మార్గమంతా భక్తులు గోవింద నామస్మరణతో అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు పుణ్యాహవాచనం, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇవాళ ఉదయం 8.00 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ & ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో భారీ విరాళం అందజేసింది. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళాన్ని అందించింది. అపర్ణ కన్స్ట్రక్షన్స్ & ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తరుణ్, రమేష్ తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. పేద ప్రజల ప్రాణరక్షణకు అండగా నిలిచే ఈ మహోన్నత సేవలో భాగస్వాములైన అపర్ణ సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు బీఆర్ నాయుడు. సమాజ హితం కోసం మరింత మంది దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.