
సింగిల్ జడ్జి తీర్పుకు డివిజన్ బెంచ్ చెక్
తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. లోతుకుంట భూవివాదం, కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన కఠిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సంచలన స్టే విధించింది. సెప్టెంబర్ 1న వెలువడిన ఈ ఉత్తర్వులతో రంగనాథ్ ప్రస్తుతానికి తన పదవిలో కొనసాగే అవకాశం స్పష్టంగా ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు సింగిల్ బెంచ్ ఆదేశాలను అమలు చేయకపోగా, ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేతో ఆయన స్థానం మరింత పటిష్టంగా మారింది. ఈ వివాదం మెదక్-మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలోని 40 ఎకరాల భూమి చుట్టూ ప్రారంభమైంది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ క్లెయిమ్ చేస్తున్న ఈ స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లి తాత్కాలిక నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కంపెనీ, కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ను అధికారులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంటెంప్ట్ పిటిషన్లు దాఖలు చేసింది. గతంలో వివాదాస్పద స్థలానికి రక్షణగా సైన్యాన్ని కూడా కాపలాగా ఉంచే స్థాయికి ఈ గొడవ చేరింది. దీంతో జూలై 27న విచారణ చేపట్టిన జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి సింగిల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్పై ఏడాదిన్నర వ్యవధిలో 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన సమర్పించిన క్షమాపణ అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ, సీఎస్ వెంటనే రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి వేరొకరిని నియమించాలని సంచలన ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాము పిటిషనర్ భూమిలోకి వెళ్లలేదని, ప్రభుత్వ స్థలాన్నే రక్షిస్తున్నామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఫలితంగా ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు పూర్తి స్థాయిలో బహిరంగ మద్దతుగా నిలిచారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా చట్టబద్ధంగానే పనిచేస్తోందని, కోర్టులను గౌరవిస్తూనే కబ్జాదారులపై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు




