
మహారాష్ట్రలోని నాందేడ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ప్రాణాంతక దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సహచరులు ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని యశోసాయి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం నాందేడ్‌కు వచ్చారు. ఇక్కడి మాతా సాహిబ్ కౌర్ ప్రాంతంలో ఉన్న ఓ గురుద్వారాను సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారా లోపల ఒక నిహంగ్ సిక్ ఒకరు కృపాణ్‌తో బాదల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడ్డాడు. బాదల్ తో పాటు భద్రత సిబ్బంది, సహచరులు అప్రమత్తంగా ఉండటంతో అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెనుగులాట చోటు చేసుకుంది. బాదల్ కుడి చేతికి గాయాలయ్యాయి. బాదల్‌ను రక్షించడానికి ప్రయత్నించిన ఓ ఎస్ఐ కూడా గాయపడ్డారు.దాడికి పాల్పడిన నిందితుడిని భద్రతా సిబ్బంది అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో నాందేడ్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కర్దిలే స్పందించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పర్యటనకు సంబంధించి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టామని, స్థానిక పోలీసు బందోబస్తు కూడా కల్పించినట్లు తెలిపారు.హైవేల విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ నూతన నిబంధనలు: రూ. 10,000 ఫైన్నిందితుడు గురుద్వారాలోకి ప్రవేశించి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2024 డిసెంబర్ 4న అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్ సమీపంలో కూడా ఆయనపై దాడి యత్నం చోటు చేసుకుంది. ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కూడా ఆయన ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నారు.సగం భూగోళం చీకట్లో..: స్టన్నింగ్ వీడియోలుప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని డాక్టర్లు ధృవీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు విచారిస్తోన్నారు. ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, దీని వెనుక కారణాలు ఏమిటనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.





