
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనను ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ఇతర దేశాధినేతలతో కలిసి దౌత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి.
ఈ క్రమంలో.. రష్యాకు చెందిన ప్రముఖ రైల్వే సంస్థ.. భారత్‌కు నూతన హైస్పీడ్ రైల్ టెక్నాలజీని ఆఫర్ చేసింది. గంటకు గరిష్టంగా 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఇవోల్గా ఎఫ్‌జీ (Ivolga FG) రైలును అందిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రష్యాకు చెందిన ట్రాన్స్‌మాష్‌హోల్డింగ్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడిన కైనెట్ రైల్వే సొల్యూషన్స్ ద్వారా ఈ ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.
ఈ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ ఇప్పటికే భారత్‌లో వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీలో చురుగ్గా పాల్గొంటోంది. హైస్పీడ్ రైళ్ల నిర్మాణంలో ఈ సంస్థకు అనుభవం ఉంది. రైల్వే నెట్‌వర్క్‌ను అత్యాధునికీకరించే ప్రక్రియ ప్రస్తుతం భారత్ లో వేగంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు దేశవ్యాప్తంగా పరుగులు పెడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటోన్నాయి. ఈ క్రమంలోనే.. ఈ ఇవోల్గా హైస్పీడ్ రైళ్ల ప్రతిపాదనను భారత్ ముందు ఉంచింది రష్యా.
ఇవోల్గా రైళ్ల గరిష్టంగా గంటకు 360 కిలోమీటర్లు. ఎనిమిది కోచ్‌లతో డిజైన్ చేసిన ఈ సూపర్ స్పీడ్ రైలులో ఒకేసారి 642 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీని తయారీలో దాదాపు 80 శాతం స్థానిక వనరులు, విడిభాగాలను ఉపయోగించుకునే అవకాశం భారత్ కు ఉందని రష్యా తన తాజా ప్రతిపాదనలో పేర్కొంది. ఇది దేశీయ తయారీ రంగానికి, మేక్ ఇన్ ఇండియా ఉద్దేశాలకు అతిపెద్ద ఊతం ఇస్తుందని కేంద్రం భావిస్తోంది.
రష్యాకు చెందిన ట్రాన్స్‌మాష్‌హోల్డింగ్ సంస్థకు భారతీయ రైల్వే రంగంతో బలమైన అనుబంధం ఉంది. దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కోసం ఈ కంపెనీ జాయింట్ వెంచర్ ద్వారా దాదాపు 6.5 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదిరింది. దీని కింద మహారాష్ట్రలోని లాతూర్ కర్మాగారంలో 120 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారవుతున్నాయి. ఈ అనుభవంతో ఇప్పుడు హైస్పీడ్ సెగ్మెంట్‌లో కూడా తమ ముద్ర వేయాలని రష్యా ప్రయత్నిస్తోంది.






