
గణేష్ నవరాత్రులు కలిసికట్టుగా ఐకమత్యంతో జరుపుకునే వేడుక.. అలాంటి పండుగలను గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన గ్రామ పెద్దలు, మరి కొందరు గ్రూపులుగా విడిపోయారు. గ్రామానికి తెచ్చిన గణేశుడిని ప్రతిష్టించకుండా, పూజలు నిర్వహించకుండా వివాదాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకుంది. ఈ సంఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగుడా మండలం పీర్జాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు చేయాలని కొందరు గ్రామస్తులు భావించారు. అయితే మరో వర్గం వారు ఇది ఒప్పుకోకుండా తాము ఏర్పాటు చేసిన గణేశుడే ఉండాలని పట్టుబట్టారు. పట్టుదలతో ఇరువర్గాల మధ్య వివాదం రేగింది. గ్రామంలో జరుగుతున్న ఈ వివాదం ఘర్షణలకు తావివ్వకుండా చౌదరిగుడా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆలయంలో ఎవరు గణేష్ విగ్రహాన్ని పెట్టకుండా వేరేచోట పెట్టుకోవాలని ఆదేశించారు. దీంతో మరో వర్గం చేసేది లేక తీవ్ర అసంతృప్తితో గణేశుడిని గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.





