
కాగజ్‌నగర్, న్యూస్‌టుడే జపాన్‌ పర్యటనలో ఉపాధ్యాయురాలు హదియా బేగం జపాన్‌ విద్యావిధానంలో అమలవుతున్న బోధన, ఇతర పద్ధతులను స్థానికంగా అమలు చేస్తానని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (న్యూ)లో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హదియా బేగం పేర్కొన్నారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌తోపాటు ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌ లింగయ్యతో కలిసి ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు ఎడ్యుకేషన్‌ ఎక్ఛేంజ్‌ ప్రోగ్రాం ఎక్స్‌పోజర్‌ విజిట్‌లో భాగంగా.. జపాన్‌లో పర్యటించారు. తిరిగి వచ్చిన తర్వాత అక్కడి విద్యావిధానం, విద్యార్థుల నైపుణ్యాలను ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. ‘సాంస్కృతిక వైవిధ్యంతో కూడిన దేశాన్ని సందర్శించడంలో భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నా. జపాన్‌ విద్యామార్పిడి పర్యటనను జపాన్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ సెంటర్‌ సమన్వయం చేసింది. పర్యటనలో భాగంగా చియోడా ఎలిమెంటరీ స్కూల్, చియోడా లోయర్‌ సెకండరీ స్కూల్, జూనియర్‌ హైస్కూల్‌ ఒట్సుకా, యూనివర్సిటీ ఆఫ్‌ సుకుబా స్పెషల్‌ నీడ్స్‌ స్కూల్‌తోపాటు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ స్కూల్‌ టీచర్స్‌ వంటి అనేక విద్యాసంస్థలను సందర్శించాం. ప్రధానంగా విద్యార్థులు చిన్న వయసు నుంచే బృంద పని, క్రమశిక్షణ, పరిశుభ్రత, ఇతరులను గౌరవించడం వంటి విలువలను పెంపొందించే విధానం, కిండర్‌ గార్డెన్, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు తమకు తామే మధ్యాహ్న భోజనం వడ్డించుకోవడం, భోజన పంపిణీలో సహకరించడం, తరగతి గదులను శుభ్రం చేసుకోవడం వంటివి ఆకట్టుకున్నాయి. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణంలో విద్యనభ్యసిస్తున్నారు. అక్కడి అంశాలు ఒక కొత్త దృక్కోణాన్ని అందించాయి. జపాన్‌లో గమనించిన విషయాలను మన విద్యార్థుల్లో పెంపొందించేందుకు నా వంతు కృషి చేస్తానని’.. పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





