
ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ దాడులను కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆరోపించిన అమెరికా, ఇరాన్లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్లోని ఒక ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లోని క్షిపణి నిల్వలు, డ్రోన్ స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని "శక్తివంతమైన దాడులు" నిర్వహించినట్లు పేర్కొంది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికే కాకుండా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)ను కూడా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఇరాన్ "తెలివితక్కువ పని" చేసిందని వ్యాఖ్యానిస్తూ.. ఇటువంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని, అమెరికా తన బాధ్యతలను పాటించిందని చెప్పారు. ఒప్పంద అమలుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, హింసకు హింసతోనే సమాధానం ఉంటుందని హెచ్చరించారు. అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికానే ఎప్పటిలాగే తన హామీలను ఉల్లంఘించిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ప్రాంతంలోని అమెరికా బలగాల మోహరింపు ప్రాంతాలను తమ నౌకాదళం లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో అమెరికా దాడులు పునరావృతమైతే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది