
Operation Tiger | ముంబయి: మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు శిందే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో చీలికపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ‘ఆరు పులులు (ఎంపీలనుద్దేశించి) ఇప్పుడు అసలైన శివసేన ఫ్యామిలీలోకి వచ్చాయి. వారికి స్వాగతం. ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది’ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే ప్రకటించారు. శిందే క్యాంప్లో చేరిన ఎంపీల్లో ఓం రాజే నింబాల్కర్, సంజయ్ దిన పాటిల్, సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, నగేష్ పాటిల్ అష్టికర్, బౌసాహెబ్ వక్చౌరే ఉన్నారు. మొత్తం 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిందే క్యాంప్లో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం 2022 జూన్ 22న 40 మంది ఎమ్మెల్యేలు తమతో వచ్చారన్న శిందే.. ఇప్పుడు ఏకంగా ‘సిక్స్’ కొట్టామని పేర్కొన్నారు. శివసేన రెండో విడత విస్తరణ ప్రణాళికగా ఈ చేరికను అభివర్ణించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల దిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో శివసేనలో మరోసారి చీలిక ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా అధికార, విపక్ష కూటముల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తాజాగా ఆరుగురు ఎంపీలు శిందే క్యాంప్లో ప్రత్యక్షమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అందడం లేదన్న కారణంతోనే తాము పార్టీ మారుతున్నట్లు రెబల్ ఎంపీలు చెప్పుకొచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత