
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రణబాలి'. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై 'రణబాలి' సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా 'రణబాలి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇదిలా ఉంటే ఈ రోజు (జూన్ 29) డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హీరో విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు విజయ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందిస్తూ - 'మనం టాక్సీవాలా సినిమా చేసి తొమ్మిదేళ్లవుతోంది. ఈ తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం. అర్థవంతమైన కథలు రాయాలనే తపన, వాటిని అందంగా తెరకెక్కించాలనే ఇష్టం నీలో ఏమాత్రం తగ్గలేదు. మనం కలిసి చేసింది రెండు చిత్రాలే అయినా ఎన్నో పోరాటాలు చేశాం. మొదటి చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ అందుకున్నాం. రణబాలితో మనం మరో విజయం సాధించాలి. నువ్వు చేసే పనుల్లో అంతా మంచే జరగాలి. రణబాలిగా నటించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నా. మన సినిమాను ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా అని వేచి చూస్తున్నా' అని రాసుకొచ్చారు రౌడీ బాయ్. కాగా తొమ్మిదేళ్ల క్రితం విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో 'ట్యాక్సీవాలా' అనే సినిమా వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడిదే కాంబోలో మరో సినిమా వస్తుండడంతో రణబాలి పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది