
ఉత్తరప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు వ్యూహరచన చేస్తున్న తరుణంలో, 'ఇండియా' కూటమిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ఐక్యంగా సాగాలని భావిస్తున్న ఈ కూటమిలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.ఎంఐఎంతో పొత్తుపై ఎస్పీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. బీజేపీని ఓడించేందుకు కృషి చేసే ఏ శక్తినైనా తాము స్వాగతిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు మతతత్వాన్ని వ్యతిరేకిస్తూనే, మరోవైపు అదే తరహా రాజకీయాలు చేసే వారితో చేతులు కలపడం సాధ్యంకాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుంది" అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, బీజేపీని అధికారం నుంచి దూరం చేసేందుకు తాము 'ఇండియా' కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. అయితే, కూటమిలో తమకు సముచిత గౌరవం, సమాన హోదా కల్పించాలని ఆయన షరతు విధించారు.2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఆశాజనక ఫలితాలను సాధించింది. అయితే, 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఒంటరిగా బరిలోకి దిగితే బీజేపీ వ్యతిరేక ఓట్లు, ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోయి అంతిమంగా బీజేపీకే లాభం చేకూరుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే క్రమంలో పటిష్ఠమైన ఐక్య