
ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో మంగళవారం సాయంత్రం భారీ గందరగోళం నెలకొంది. బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్లో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్లో ఈ సంఘటన జరగడంతో పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులు భారీ క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. ఇళ్లకు చేరుకోవడానికి వేరే దారి లేక టెక్కీలు, సాధారణ ప్రయాణీకులు రోడ్లపై వెళ్తున్న లారీలు, ట్రక్కులను ఆశ్రయించి ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.రోడ్లపై ట్రాఫిక్ జామ్.. స్తంభించిన రవాణా వ్యవస్థ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తడంతో రైళ్లలోని ప్రయాణీకులను కిందకు దిగిపోవాలని అధికారులు కోరారు. దీనితో ఒక్కసారిగా వేలాది మంది ప్రయాణీకులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం రోడ్లపైకి రావడతో బెంగళూరు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మెట్రో నిలిచిపోవడంతో క్యాబ్లు, ఆటోలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే అవి కూడా దొరక్కపోవడం లేదా ఆటో డ్రైవర్లు రావడానికి నిరాకరించడంతో ప్రయాణీకుల కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే విసిగిపోయిన ఐటీ నిపుణులు, ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరడానికి లారీల వెనుక భాగంలోకి ఎక్కి ప్రయాణించాల్సి వచ్చింది.ఫస్ట్ వరల్డ్ టాలెంట్.. ధర్డ్ వరల్డ్ గవర్నెన్స్ బెంగళూరు నగరంలో తలెత్తిన ఈ దుస్థితిపై ప్రతిపక్ష నేతలు, పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్ (అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రతిభ.. మూడో ప్రపంచ దేశాల స్థాయి పాలన). ఇదే బెంగళూరు ప్రస్తుత కథ అంటూ ఆయన ట్వీట్ చేశారు. బెంగళూరులో మెట్రో అంతరాయాలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన మండిపడ్డారు