
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారతీయ మూలాలున్న వారు రాజకీయాల్లో అడుగుపెట్టాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) పిలుపునిచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో భారత్కు వ్యతిరేకంగా విద్వేషపూరిత ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సూచన చేశారు. జాతి వివక్ష ఘటనలకు వ్యతిరేకంగా తమ స్వరం వినిపించేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని, ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రవాస భారతీయులను (Indian-Americans) కోరారు. ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ (FIIDS) ఆధ్వర్యంలో క్యాపిటల్ హిల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజా కృష్ణమూర్తి మాట్లాడారు. అమెరికాలో అత్యంత విద్యావంతులు, సంపన్న వర్గాల్లో ఒకరిగా ఉన్నప్పటికీ.. భారతీయ-అమెరికన్లు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని రాజా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అమెరికన్లలో భారత, హిందూ వ్యతిరేక ధోరణి పెరుగుతుండడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటిని ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని స్థాయుల్లోని రాజకీయ పదవులకు పోటీ చేయాలని ప్రోత్సహించారు. మనం ఎదుర్కొనే సమస్యలపై గళం ఎత్తకపోతే బాధితులుగా మిగిలిపోవాల్సి వస్తుందన్నారు. దేశంలో వలసదారులపై ద్వేషం పెరుగుతోందని.. ఈ సమస్యను ఎదుర్కోవడంలో ప్రవాస భారతీయులు ఐక్యంగా ఉండాలని మరో కాంగ్రెస్ సభ్యుడు థానేదార్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు