
ఇంటర్నెట్డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు (Trump to visit India). వచ్చే ఏడాదిలో ఆయన పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు అద్భుతమంటూ కొనియాడారు. అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఖరారు చేయడానికి ఈ ఏడాది ముగిసేలోపే తాను భారత్కు వెళ్తానని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ మొదటి భారత పర్యటన ఇదే కానుంది. అమెరికాకు భారత్ అత్యంత సన్నిహిత భాగస్వామి అని.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) - ట్రంప్ (Donald Trump) మధ్య మంచి అనుబంధం ఉందని మార్కో రూబియో తెలిపారు. దౌత్యపరంగా వారి బంధం చాలా ఉపయోగకరమన్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సులో వాణిజ్య ఒప్పందం గురించి మోదీ-ట్రంప్ చర్చించారని రూబియో వెల్లడించారు. ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు త్వరలో పూర్తి కానున్నట్లు తెలిపారు. ఇంధన సరఫరాను పెంచడానికి భారత్-అమెరికా కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. చమురు శుద్ధి చేయగల సామర్థ్యం ఉన్న కొన్ని దేశాలలో భారత్ కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై రూబియో ప్రశంసలు కురిపించారు. తాను ఆయనకు అభిమానినని తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మోదీ భారత్ను ఒక ప్రపంచ శక్తిగా మార్చారని కొనియాడారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు