
ఉత్తరప్రదేశ్లో నూతనంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం తమ వేలాది ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులే ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే తొలి విమానంలో ప్రయాణించనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు నోయిడాలోని జేవార్ నుంచి లక్నోకు ఈ విమానం బయలుదేరనుంది.ఈ చారిత్రక విమాన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, "బహుశా చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే అందులోంచి బయలుదేరే తొలి విమానంలో ప్రయాణికులు కాబోతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దార్శనికతతో రైతుల కలలు నెరవేరాయి" అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులతో కలిసి తాను కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రయాణిస్తున్న రైతులలో మహిళలు, భూమి ఇవ్వకపోయినా విమానాశ్రయ నిర్మాణం వల్ల నిర్వాసితులైన వారు కూడా ఉన్నారని ఎమ్మెల్యే వివరించారు. లక్నో చేరుకున్న తర్వాత ఈ రైతులందరూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో ముచ్చటిస్తారు. "సామాన్యుడు కూడా విమానమెక్కాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ కల. అది రేపు జేవార్ నుంచి నెరవేరబోతోంది" అని ధీరేంద్ర సింగ్ పేర్కొన్నారు.ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 'వికసిత ఉత్తరప్రదేశ్'కు ఈ విమానాశ్రయం ఒక చిహ్నంగా నిలుస్తుందని ఆనాడు ప్రధాని వ్యాఖ్యానించారు