
మా ఆయనే దొరికాడా..ఆయను ఏమైనా అయితే చూస్తూ ఉరుకోము... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. శ్రీనివాస్ విచారణను నిరసిస్తూ ఆయన భార్య దివ్వల మాధురి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విచారణ ప్రక్రియ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని కొత్తూరు పోలీస్ స్టేషన్లో కొనసాగింది. సమాచారం అందుకున్న దువ్వాడ మాధురి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని అక్కడ భారీ హల్చల్ సృష్టించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు ఆమెతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలను, దువ్వాడ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దువ్వాడ మాధురి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఎన్నో నేరాలు జరుగుతుంటే పోలీసులు కేవలం తమ కుటుంబాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. "పోలీసులకు మా ఆయనే దొరికాడా? ఆయనకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చూస్తూ ఊరుకోబోము" అంటూ ఆమె గట్టిగా హెచ్చరించారు. పాత ఫిర్యాదులపై ఇప్పుడు నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందన్నది మాధురి వాదన. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ కల్యాణ్ విమర్శించినప్పుడు తప్పు లేనప్పుడు, శ్రీనివాస్ మాట్లాడితే అది ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు ఒకపక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలను తాము ఎండగట్టినందుకే ప్రభుత్వం ఈ విధమైన వేధింపులకు దిగుతోందని దువ్వాడ మాధురి ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని, ఎలాంటి విచారణకైనా తాను కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు అధికార కూటమి తీరును తప్పుబడుతున్నాయి