
ఇంటర్నెట్డెస్క్: అంతర్జాతీయ వేదికగా భారత్ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్పై ప్రేలాపనలు చేసిన దాయాదికి మన దేశం గట్టిగా బుద్ధి చెప్పింది. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాక్ (Pakistan).. ఇప్పుడు వాటి కాటుకే బలవుతోందని దుయ్యబట్టింది. ఈసందర్భంగా సింధూ జలాల ఒప్పందం (Indus Water Treaty) రద్దును భారత్ ప్రస్తావించింది. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశం.. సద్భావన, స్నేహంతో కలిగే ప్రయోజనాలను పొందలేదని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఐరాసలోని భారత ప్రతినిధి అనుపమా సింగ్ స్పందిస్తూ.. దాయాదిపై నిప్పులు చెరిగారు. ‘‘జమ్మూకశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఇక్కడ పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే.. అది భారత భూభాగాలను పాక్ ఆక్రమించుకోవడం (పీవోకేను ఉద్దేశిస్తూ), వాటిని తిరిగి ఇవ్వకపోవడమే..! ఈ భూభాగాల్లో కొన్ని దశాబ్దాలుగా సైనిక బలగాల అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కనీస స్వేచ్ఛకు నోచుకోక అక్కడి ప్రజలు బుల్లెట్లు, క్రూరత్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల రావల్కోట్లో జరిగిన విషాదం.. పాక్ దారుణాలకు నిలువెత్తు సాక్ష్యం. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి శిక్షణ ఇవ్వడాన్ని ఆ దేశ రక్షణ మంత్రి తమ ప్రభుత్వవిధానంగా చెబుతారు. అలాంటి దేశం.. ఇప్పుడు తాము ఉగ్రవాద బాధితులమని వాపోవడం హాస్యాస్పదం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాక్ అరాచక శక్తులను పెంచి పోషించింది. ఇప్పుడు అవి తిరిగి ఆ దేశాన్నే కాటేస్తున్నాయి’’ అని అనుపమా సింగ్ ఎద్దేవా చేశారు. ఇటీవల పీవోకేలోని రావల్కోట్లో ఆందోళనకారులను పాక్ అణచివేసే క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రవాది తర్వాత పాకిస్థాన్తో భారత్ రద్దు చేసుకున్న సింధూ జలాల ఒప్పందం గురించి కూడా అనుపమ ప్రస్తావించారు. ‘‘ఈ ఒప్పందంపై మా వైఖరేంటో అందరికీ తెలుసు. విధానపరమైన సాధనంగా ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ఒక