
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. NEET Re Exam 2026: రేపు దేశ వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే విద్యార్థులంతా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే నీట్-యూజీ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన ఘోర తప్పిదం వల్ల.. ఓ విద్యార్థి గందరగోళానికి గురయ్యాడు. సదరు విద్యార్థికి పరీక్ష ఇండియాలో అయితే.. సెంటర్ మాత్రం దుబాయ్లో వేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే విద్యార్థికి ఏకంగా అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రేపు జరిగే నీట్ రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగా.. అందులో పరీక్షా కేంద్రం అబుదాబిలోని ఒక స్కూల్ అని ఉండటంతో విద్యార్థి కుటుంబం షాక్ అయింది. తాము సెలెక్ట్ చేసిన ఆప్షన్లలో అసలు అబుదాబి పేరునే పెట్టలేదని విద్యార్థి తండ్రి మహ్మద్ తాలిబ్ తెలిపారు. దీనిపై వెంటనే ఎన్టీఏ హెల్ప్లైన్ను సంప్రదించగా మెయిల్ పంపాలని సూచించారన్నారు. అయితే ఈ ఊహించని తప్పిదంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విద్యార్థి అబ్దుల్లా రోజంతా కన్నీరు పెట్టుకున్నాడని.. పరీక్ష రాయనని మొండికేయగా తల్లి నచ్చజెప్పిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమ కుమారుడికి పాస్పోర్ట్ కూడా లేదని ఆయన వెల్లడించారు. తాము పరీక్ష కోసం 3 జిల్లాలను ఆప్షన్లుగా ఇచ్చామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వేరే జిల్లాకు వెళ్లే సమయం కూడా లేనందున నాగ్పూర్లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలని సదరు కుటుంబం అధికారులను డిమాండ్ చేశారు. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అలా జరిగిందని.. సదరు విద్యార్థికి పరీక్షా కేంద్రాన్ని నాగ్పూర్కే కేటాయించామని ఎన్టీఏ అధికారులు తెలిపారు