
తమిళనాడులో ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరో 74 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల్లోకి వెళితే, తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం సమీపంలోని కన్నిగైపెట్టై గ్రామంలో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ ఒక్కసారిగా లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఊపిరాడక కుప్పకూలిపోయారు. బాధితుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారేనని తెలుస్తోంది. వీరిలో చాలా మంది 24-25 ఏళ్ల వయసున్న యువతులే ఉన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని వేల్స్, వెంకటేశ్వర ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 11 మంది వెంటిలేటర్లపై ఉన్నారని, మరికొందరికి ఇంట్యూబేషన్ చేశామని వైద్యులు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లోని వాల్వ్ ఫెయిల్ కావడం వల్లే గ్యాస్ లీక్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్. కవిత ఘటనా స్థలాన్ని, ఆసుపత్రులను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై, కంపెనీలో భద్రతా లోపాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు