
విజయవాడ నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తండ్రికొడుకులపై గంజాయి మత్తులో యువకుడు దాడి చేశాడు. విజయవాడ, జూన్ 23: నగరంలోని కృష్ణ లంక, కరకట్ట ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి గంజాయి మత్తుల్లో రామ్ చరణ్ అనే యువకుడిపై కుమార్ అనే వ్యక్తి వడ్రంగి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని అక్కడే ఉన్న రామ్ చరణ్ తండ్రి కర్రి భాను అడ్డుకున్నాడు. దాంతో ఆయనపై కూడా కుమార్ కత్తితో దాడి చేశాడు. తండ్రికొడుకుల పీకలను కత్తితో కోసి.. కుమార్ అక్కడ నుంచి పరారయ్యాడు. రక్తం మడుగులో వీరిద్దరు కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి.. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే రామ్ చరణ్ పరిస్థితి మరింత విషమంగా మారడంతో.. మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కరకట్ట పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ల ఆగడాలు మళ్లీ పెరిగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణలంకతోపాటు కరకట్ట పరిసర ప్రాంతాల్లో నిరంతర గస్తీ నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆ ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్లో లోపాలు సరిదిద్దండి.. సీఈవోకు టీడీపీ లేఖ