
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక 'ఎక్స్ప్రెస్ అడ్డా' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' గ్రూప్ సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఆ పత్రిక నేషనల్ ఒపీనియన్ ఎడిటర్ వందిత మిశ్రా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ సందర్భంగా వందిత మిశ్రా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జాతీయ మీడియా వేదికపై ఆయన పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సమాజంలో మార్పునకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖులతో 'ఎక్స్ప్రెస్ అడ్డా' కార్యక్రమాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటుంది. గతంలో కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు.నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి 91 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే