
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన రాజకీయ సమరం మొదలైంది. ఒకప్పుడు రాష్ట్ర గమనాన్ని మార్చిన టీఆర్ఎస్ అనే మూడక్షరాల పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడమే కాకుండా, తీవ్ర ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద అభ్యంతరాల సుడిగుండంలో చిక్కుకుంది. భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి గతేడాది సెప్టెంబరు 2న కవిత సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంతంగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 25న ఆమె అధికారికంగా సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ పార్టీ ఆవిర్భవించిందని ఆమె స్పష్టం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీఐ నిబంధనల ప్రకారం.. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జగృతి, తెలంగాణ ప్రజా శక్తి అనే ఐదు పేర్లను ప్రతిపాదించగా, అందులో ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును పరిశీలనకు తీసుకుంటూ ఏప్రిల్ 30న ఈసీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఈ పార్టీకి సంక్షిప్త నామంగా ‘TRS’ అని నిర్ణయించడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ పేరును కవిత పార్టీకి కేటాయించవద్దంటూ దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు ఈసీకి అందినట్లు సమాచారం. ఈ అభ్యంతరాలలో అత్యధిక భాగం బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య శ్రేణులు, వారి అనుచరుల నుంచే వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS) పేరును ‘భారత రాష్ట్ర సమితి’ (BRS)గా మార్చినప్పటికీ, ప్రజల్లో ఇప్పటికీ టీఆర్ఎస్ సెంటిమెంట్ బలంగా ఉంది. ఇప్పుడు