
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా అర్జెంటీనా ఫుట్బాలర్ లుకాస్ ట్రెజో కుటుంబం ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయింది. భవనం కూలిపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు శిథిలాల కిందే నలిగిపోయారు. ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రెండు రోజుల క్రితం వెనెజువెలా ఫుట్బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో భార్య.. తన కుమార్తెను కాపాడుతూ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా అర్జెంటీనా ఫుట్బాలర్ లుకాస్ ట్రెజో కుటుంబం ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయింది. భవనం కూలిపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు శిథిలాల కిందే నలిగిపోయారు. కాగా వీరి మరణాన్ని ఫుట్బాల్ క్లబ్ ‘డిపోర్టివో లా గువేరా’ ధ్రువీకరించింది. ఈ భూకంపం ధాటికి వెనెజువెలాలోని యారకూ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. లుకాస్ కుటుంబం ఉన్న భవనం కూడా కూలడంతో అతడి భార్య యానినా మారనెల్లా, ఇద్దరు పిల్లలు శిథిలాల కిందే చిక్కుకున్నారు. వారిని గుర్తించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆ ముగ్గురు శిథిలాల కిందే ప్రాణాలు విడిచారు. అప్పుడు ఫుట్బాల్ ఆటగాడు ట్రెజో తన టీమ్తో వేరే ప్రాంతంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగాడు. భూకంపం తర్వాత తన భార్య, పిల్లలు గల్లంతయ్యారన్న వార్త విని షాక్కు గురైన ట్రెజో.. ఘటనా స్థలానికి వచ్చి తన కుటుంబం కోసం శిథిలాలను తొలగిస్తూ వెతకడం ప్రారంభించాడు. కానీ అప్పటికే ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీనికి ముందు ట్రెజో.. తన కుటుంబం ఆచూకీ కోసం సోషల్ మీడియాలో భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు. ‘భూకంపం ధాటికి మా అపార్ట్మెంట్ కూలిపోయింది. నా కుటుంబం గురించి ఎలాంటి సమాచారం లేదు. దయచేసి అందరూ ప్రార్థించండి’ అంటూ అతడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఈ జంట భూకంపాల వల్ల 60 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. ఇప్పటివరకు 1400 పైగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది
