
దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) పురస్కరించుకొని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాందేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగా ప్రక్రియలను రాందేవ్ బాబా సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యోగాకు రాందేవ్ బాబా మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. యోగా సాధనతో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ఆయన శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందన్న సీఎం, ఆధ్మాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 31 శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. రాందేవ్బాబా (Ramdev Baba) మాట్లాడుతూ అభివృద్ధి, విజన్ కలిగిన సీఎం, చంద్రబాబు అని కితాబిచ్చారు. ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యాలను అనుగుణంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) తదితరులు పాల్గొన్నారు