
ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఇక అంతా స్వర్ణయుగమే...ఈ మాట కర్నూలుజిల్లా జొన్నగిరిలో కాదు కాదు స్వర్ణగిరిలో గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాదు మరో మాట కూడా అన్నారు. రాయలసీమను మళ్లీ రతనాల సీమగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాయలసీమ అంటే అందరికీ గుర్తొచ్చేది కరవు ప్రాంతం, ఫ్యాక్షనిజం. కానీ.. వందల ఏళ్ల క్రితం ఇదే మట్టిలో బంగారం పండింది. వజ్రాలు దొరికాయి. ఇన్నాళ్లూ కథలుగా చెప్పుకున్న ఆ 'రతనాల సీమ' నిజమేనని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఊరి పేరు 'జొన్నగిరి'. కానీ దాని అసలు పేరు.. “సువర్ణగిరి”. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహారాజు అశోకుడు. ఆయమ కాలంలో మౌర్య సామ్రాజ్యానికి నాలుగు రాజధానులు ఉండేవి. అందులో దక్షిణ భారత దేశాన్ని శాసించిన 'నాలుగో రాజధానే' ఇదే సువర్ణగిరి, అంటే నేటి జొన్నగిరి. ఈ ప్రాంతానికి వెళ్తే ఇప్పటికీ అశోకుడి కాలం నాటి ప్రసిద్ధ 'ఎర్రగుడి శిలాశాసనాలు' మనకు కనిపిస్తాయి. నాటి మౌర్యుల కాలంలోనే ఇక్కడి కొండల్లో, మట్టిలో ప్రవహించిన బంగారాన్ని చూసి.. దీనికి 'సువర్ణగిరి' అని నామకరణం చేశారు. అశోకుడి కాలమే కాదు.. ఆ తర్వాత వచ్చిన శాతవాహనులు, విజయనగర రాజుల కాలంలో కూడా ఈ ప్రాంతం సిరిసంపదలతో తులతూగింది. వందల ఏళ్ల కిందట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం పడితే చాలు.. పొలాల్లో వజ్రాలు, రత్నాలు మెరిసేవట. అందుకే విదేశీ యాత్రికులు కూడా మన రాయలసీమను 'రతనాల సీమ' అని పొగిడారు. కాలక్రమంలో సామ్రాజ్యాలు అంతరించాయి.. సువర్ణగిరి కాస్తా జొన్నగిరిగా మారిపోయింది. కానీ, ఆ మట్టి పొరల్లో దాగున్న బంగారం మాత్రం ఎక్కడికీ పోలేదు. తరతరాలుగా దాగి ఉన్న ఆ లంకె బిందె లాంటి బంగారు గని.. ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చింది. దాదాపు రూ. 405 కోట్ల భారీ పెట్టుబడితో 'జియోమైసూర్ సర్వీసెస్' సంస్థ ఇక్కడ కమర్షియల్ మైనింగ్ను ప్రారంభించింది