
అమెరికాలో పర్యటిస్తున్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్, 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రగతి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వర్జీనియాలో ప్రవాస తెలుగువారితో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా గాలి భానుప్రకాశ్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల విజయం ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రతి తెలుగువాడిదని అన్నారు. ఈ గెలుపులో ప్రవాసుల పాత్రను చంద్రబాబు ఎప్పుడూ ప్రశంసిస్తారని గుర్తుచేశారు. లోకేశ్ చొరవతో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు ఇటీవలి పదో తరగతి ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆశయాలకు అనుగుణంగా నగరి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శమన్నారు. ఆ వారసత్వాన్ని భానుప్రకాష్ కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమ సమన్వయకర్తలు మాగులూరి భానుప్రకాశ్, యష్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి మాగులూరి భానుప్రకాశ్ అధ్యక్షత వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో సాయిశ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి, సత్యనారాయణరాజు, మాధవనాయుడు బోయెల్ల సహా పలువురు ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు