
తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి ఉద్వేగాలను దాటి పుష్కరం దాటిపోయింది. గ్లోబల్ సిటీగా మారిన హైదరాబాద్ అభివృద్ధిని అందుకోవడం, నిరుద్యోగ నివారణ, ఉపాధి అవకాశాల సృష్టి, ఆర్థిక స్వావలంబన వంటివి నేటి తరం ఓటర్ల అసలు సిసలైన ప్రాధాన్యతలు. కానీ, దురదృష్టవశాత్తూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం నేటికీ పాత చింతకాయ పచ్చడి లాంటి ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రాన్నే నమ్ముకుని రాజకీయం చేయాలని చూడటం ఒక విచిత్రమైన అజెండా సంక్షోభాన్ని కళ్ళకు కడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకునే బలమైన సామాజిక, ఆర్థిక అజెండాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే పార్టీలు మళ్లీ ప్రాంతీయ విభేదాలను రాజేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీల సెంటిమెంట్ పిచ్చి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా వస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా వివాదమే ఒక తాజా ఉదాహరణ. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్పై సోషల్ మీడియాలో ఎవరో ఇద్దరు నెటిజన్లు “దీనికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ అవసరమా?” అంటూ అజ్ఞానంతో, వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. నిజానికి తెలంగాణ యాసలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల దరఖాస్తు లేదా భార్యాభర్తలు విడిపోయేటప్పుడు రాసుకునే అంగీకార పత్రం అని అర్థం. కొందరు నెటిజన్ల వెకిలి చేష్టలను, అజ్ఞానపు ట్రోల్స్ను పట్టుకుని.. ఇక్కడి రాజకీయ పార్టీలు, మేధావుల బృందాలు దానిని ఏకంగా తెలంగాణ అస్థిత్వంపై, యాసపై ఆంధ్రా వాళ్ళు చేస్తున్న దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. ఒక సినిమా టైటిల్ లేదా యూట్యూబర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత పెద్ద పొలిటికల్ డ్రామా నడపడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని సగటు ఓటరు సులభంగానే గ్రహిస్తున్నాడు. ఉద్యమ సమయంలో ‘ఆంధ్రా పాలకులు – వలసవాదం’ అనే నినాదం ప్రజలను విపరీతంగా కదిలించింది. ఎందుకంటే నాడు అధికారం, నిధులు, నియామకాలు అన్నీ ఇతరుల చేతుల్లో ఉండేవి. కానీ రాష్ట్రం