
ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమిపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరును తప్పుబడుతూ, అతను జట్టు కోసం కాకుండా కేవలం సొంత స్కోరు కోసమే ఆడాడని విమర్శించాడు. 155 పరుగుల లక్ష్య ఛేదనలో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో వచ్చిన తిలక్.. 46 బంతుల్లో 55 పరుగులు మాత్రమే చేయడం టీ20 ఫార్మాట్కు ఏమాత్రం సరిపోదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. తిలక్ కేవలం సింగిల్స్, డబుల్స్తో మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లి, తానే గెలిపించి ‘హీరో’ అవ్వాలని చూశాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. జెర్సీ ఎత్తి సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనే తప్ప, మ్యాచ్ను ముందే ముగించాలనే ప్రణాళిక అతనికి లేదన్నాడు. దూబే, అక్షర్ పటేల్ కూడా స్ట్రైక్ రేట్ పెంచడంలో విఫలమయ్యారని మండిపడ్డాడు. భారత ఇన్నింగ్స్ మధ్యలో వరుసగా 45 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాకపోవడం అత్యంత అవమానకరమని శ్రీకాంత్ అన్నాడు. ఐర్లాండ్ వంటి సాధారణ బౌలింగ్ అటాక్ ముందు ఇలా ఆడటం వల్లే భారత్ 1 పరుగు తేడాతో ఓడిపోవడమే కాకుండా, ఐర్లాండ్ చేతిలో మొదటిసారి టీ20 సిరీస్ క్లీన్స్వీప్ను ఎదుర్కోవాల్సి వచ్చిందని శ్రీకాంత్ స్పష్టం చేశాడు