
Sehwag Comments: సంచలనాలకు వేదికైన టీ20 క్రికెట్లో ఐర్లాండ్ జట్టు భారత్కు ఊహించని షాకిచ్చింది. తొలి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయంతో టీమిండియా సిరీస్లో వెనుకబడింది. అయితే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ విద్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెలెక్టర్లు, యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఐర్లాండ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో భారత హిట్టర్లు పూర్తిగా చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ, శివం దూబే కాసేపు పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లు క్రీజులోకి వచ్చి వెళ్లడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో కొత్త కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్లోనే ఓటమి భారంతో కెరీర్ను ప్రారంభించాల్సి వచ్చింది. ఈ పరాజయంపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల శ్రీలంక ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ సృష్టించిన విద్వంసాన్ని చూసి కూడా అతడిని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ వైభవ్ క్రీజులోకి వచ్చి ఉంటే, పవర్ప్లేలోనే సగం టార్గెట్ పూర్తయిపోయేదని, కేవలం 12-13 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోయేదని సెహ్వాగ్ విశ్లేషించారు. ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్తో పాటు ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు బాధ్యతారాహిత్యంగా ఆడి తక్కువ స్కోర్లకే వికెట్లు పారేసుకున్నారు. ఆల్రౌండర్లగా బరిలోకి దిగిన అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సైతం నిర్లక్ష్యంగా ఆడటంతో భారత్ ఓటమి ఖాయమైంది. చిన్న జట్లపై ఆడేటప్పుడే వైభవ్ లాంటి యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఇవ్వాలని, అప్పుడే వారు భవిష్యత్తులో ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్లతో పోరాడగలరని సెహ్వాగ్ హితవు పలికారు. మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం