
1947 లో భారత ఉపఖండ విభజన జరిగిన సమయంలో నాటి పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ప్రాంతాలలో గణనీయమైన సంఖ్యలో ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం నామమాత్రపు స్థాయికి పడిపోవడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్య సమయంలో పాకిస్తాన్లో దాదాపు 27 శాతం, బంగ్లాదేశ్ (నాటి తూర్పు పాకిస్తాన్)లో సుమారు 33 శాతంగా నమోదైన హిందువుల జనాభా.. ప్రస్తుతం వరుసగా 1.6 శాతం, 7.9 శాతానికి క్షీణించింది. ఈ భారీ పతనం అనేది కేవలం ప్రకృతిసిద్ధమైన జనాభా మార్పుల వల్ల జరిగింది కాదనీ, దశాబ్దాలుగా ఆయా దేశాలలో అమలవుతున్న ప్రభుత్వ విధానాలు, చట్టపరమైన వివక్ష, మతపరమైన వేధింపులు, ఆస్తుల అపహరణ, బలవంతపు మతమార్పిడుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వివిధ చారిత్రక ఆధారాలు, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్ ఏర్పడిన తొలినాళ్లలో సమాన హక్కుల గురించి వాగ్దానాలు చేసినప్పటికీ.. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు తలెత్తాయి. 1949లో ఆమోదించిన ఆబ్జెక్టివ్స్ రెజొల్యూషన్ ద్వారా ఆ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించడంతో మైనారిటీల హక్కుల క్షీణతకు పునాది పడింది. ముఖ్యంగా 1970వ దశకం చివర్లో జనరల్ జియా-ఉల్-హక్ నాయకత్వంలో ప్రారంభమైన తీవ్ర ఇస్లామీకరణ ప్రక్రియ ఆ దేశ సామాజిక, రాజకీయ వ్యవస్థలను మార్చివేసింది. హుదూద్ ఆర్డినెన్సులు, కఠినమైన బ్లేస్ఫెమీ (మత దూషణ) చట్టాలు ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన ఆయుధాలుగా మారాయి. పాఠ్యపుస్తకాలలో హిందువులను వ్యతిరేకులుగా చిత్రించడం, మదర్సాల విస్తరణ ద్వారా మతపరమైన తీవ్రతను పెంచడం వంటి చర్యలు మైనారిటీల మనుగడను మరింత క్లిష్టతరం చేశాయి. లాహోర్, కరాచీ వంటి చారిత్రక నగరాల్లో ఒకప్పుడు సగానికి పైగా ఉన్న హిందూ పౌరుల సంఖ్య నేడు దాదాపు జీరోకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు బంగ్లాదేశ్లో కూడా హిందూ మైనారిటీల పరిస్థితి తీవ్రంగా దిగజారింది. 1971 విముక్తి యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం జరిపిన అమానుష హత్యాకాండలో హిందువులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు