
ఇంటర్నెట్ డెస్క్: భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాకు (Venezuela Earthquake) ఆయా దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా లాటిన్ అమెరికా దేశానికి ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ‘ఆపరేషన్ అమిస్తాద్’ (Operation Amistad) కొనసాగుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) వెల్లడించారు. ఇందులో భాగంగా సహాయక చర్యలకు అవసరమైన సామగ్రితో భారత సైన్యానికి చెందిన రెండు సీ17 విమానాలు బయలుదేరినట్లు చెప్పారు. భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించే సామర్థ్యమున్న రెండు మొబైల్ ఆసుపత్రి టెంట్లు (BHISHM Cubes) సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, ఔషధాలు, వైద్య పరికరాలు పంపించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. క్లిష్ట సమయంలో వెనెజువెలా ప్రభుత్వానికి, అక్కడి పౌరులకు అవసరమైన సాయం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. అమిస్తాద్ (Amistad) అంటే స్పానిష్ భాషలో స్నేహం అని అర్థం. వెనెజువెలా జంట భూకంపాలు.. 40వేల మంది మిస్సింగ్ వరుస భూకంపాల ధాటికి వెనెజువెలాలో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసేందుకు భారీ నిర్మాణ పరికరాలు అవసరమని, వీటిని అందుబాటులో ఉంచాలని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ అక్కడి వ్యాపార సంస్థలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, అమెరికా, చిలీ, స్విట్జర్లాండ్, తుర్కియే నుంచి సహాయక బృందాలు ఇప్పటికే వెనెజువెలా చేరుకొని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఖతార్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా దేశాధినేతలు కూడా తమ బృందాలను పంపిస్తామని ప్రకటించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి