
తమిళ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్ప్లే నిపుణుడు కే. భాగ్యరాజ్ శనివారం కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో గుండెపోటు రాగా.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే వైద్యులు ఆయన మృతిని ధ్రువీకరించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా నాలుగు దశాబ్దాలకుపైగా తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దర్శక దిగ్గజం కే. భారతి రాజా శిష్యుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన భాగ్యరాజ్.. కొద్ది కాలంలోనే తన ప్రత్యేక శైలితో స్టార్ దర్శకుడిగా ఎదిగారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవితం, భార్యాభర్తల బంధం, ప్రేమ, కుటుంబ విలువలను హాస్యంతో మేళవించి చెప్పడంలో ఆయనకు సాటి చాలా అరుదు. అందుకే తమిళ ప్రేక్షకులు ఆయనను కేవలం దర్శకుడిగానే కాదు, "వన్ మ్యాన్ ఇండస్ట్రీ"గా కూడా అభివర్ణించేవారు. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం, నటన.. ఇలా ఒక సినిమాకు అవసరమైన దాదాపు అన్ని బాధ్యతలను ఒంటరిగా నిర్వహించి ఎన్నో విజయాలు సాధించారు. తెరపై నవ్వులు పూయిస్తూనే.. భాగ్యరాజ్ సినిమాల ప్రత్యేకత కథల్లోనే కాదు.. వాటి వెనుక ఉన్న ఆలోచనల్లో కూడా కనిపించేది. సమాజంలో సున్నితమైన అంశాలను ఎంచుకుని వాటిని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసేవారు. కుటుంబ వ్యవస్థ, మహిళల స్థానం, దాంపత్య బంధాలు, మానవ సంబంధాల్లోని సంఘర్షణలను ఆయన తెరపై కొత్త కోణంలో ఆవిష్కరించారు. అప్పట్లో ఆయన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు తీవ్ర చర్చకు దారితీసినా.. అదే సమయంలో ప్రేక్షకులను ఆలోచింపజేసే శక్తి కూడా వాటికి ఉండేది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా భాగ్యరాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహజమైన నటన, టైమింగ్తో కూడిన కామెడీ, భావోద్వేగ సన్నివేశాల్లోని లోతైన అభినయం ఆయనను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితమే. ఆయన నటించిన, దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్ కావడమే కాకుండా